సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ttddevasthanam.online అనే నకిలీ వెబ్సైట్ను టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ వెబ్సైట్ టీటీడీ అధికారిక ఆన్లైన్ సేవలను పోలి ఉండేలా రూపొందించిన కొందరు వ్యక్తులు భక్తులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని సూచించింది.
టీటీడీ అధికారిక వెబ్సైట్ను పోలి ఉండేలా, కేవలం డొమైన్ పేరులో స్వల్ప మార్పులతో ఈ నకిలీ వెబ్సైట్ రూపొందించారు. ఇందులో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు శ్రీవారి దర్శనం, సేవా టికెట్లు అందుబాటులో ఉన్నట్లు తప్పుడు సమాచారం ప్రదర్శిస్తున్నారు. దర్శన టికెట్ల పేరుతో భక్తుల నుంచి నగదు వసూలు చేయడం ద్వారా వారిని మోసం చేయడంతో పాటు, టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీయడమే ఈ నకిలీ వెబ్సైట్ ఉద్దేశం.
►ALSO READ | అన్నమయ్య జిల్లాలో చెడ్డి గ్యాంగ్ : హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు
ఈ నకిలీ వెబ్సైట్ను వెంటనే తొలగించాలని సంబంధిత డొమైన్ ప్లాట్ఫారమ్ నిర్వాహకులకు టీటీడీ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. అలాగే ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతోంది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా భక్తులను మోసం చేసే వారిపైచట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
టీటీడీ సేవలు, దర్శనం, వసతి, ఆన్లైన్ టికెట్లకు సంబంధించి భక్తులు అధికారిక టీటీడీ వెబ్సైట్ ,అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుకింగ్లు చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది టీటీడీ. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అనధికారిక వెబ్సైట్లు, లింకులను నమ్మి మోసపోవద్దని కోరడమైనది.
