
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. శుక్రవారం హైదరాబాద్ సమాచార భవన్లో ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న ప్రియాంకను ఫెడరేషన్ బృందం కలిసి అభినందనలు తెలిపింది. అనంతరం జర్నలిస్టుల సమస్యలపై కమిషనర్తో చర్చించారు.
ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, మహిళా జర్నలిస్టుల సమస్యలు, వేజ్ బోర్డు అమలు తదితర అంశాలపై ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అక్రిడిటేషన్లకు నాలుగోసారి స్టిక్కర్లు వేయబోతున్నారని, ఇది సరికాదన్నారు. ఉద్యోగుల కోసం కొత్తగా తెచ్చే ఆరోగ్య పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయాలని కోరారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పి.రామచందర్, రఘు, విజయానంద్, తాటికొండ కృష్ణ, కార్యదర్శులు సలీమ, చంద్రశేఖర్, జగదీశ్, దామోదర్, రాజశేఖర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.