గోల్డ్ పేరిట మోసగించిన ఇద్దరు అరెస్ట్

గోల్డ్ పేరిట మోసగించిన ఇద్దరు అరెస్ట్

నల్గొండ అర్బన్, వెలుగు: గోల్డ్ పేరిట మోసగించిన ఇద్దరిని నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నల్గొండ వన్ టౌన్ పీఎస్‎లో మీడియా సమావేశంలో డీఎస్పీ కె. శివరాం రెడ్డి వివరాలు వెల్లడించారు. నల్గొండ టౌన్‎లోని అనస్వి మెడికల్ షాప్ ఓనర్ వేముల రాజు వద్దకు గత నవంబర్‎లో మెడిసిన్ కోసం  ఓ వ్యక్తి మహిళతో కలిసి వెళ్లాడు. ఒంగోలు జిల్లాకు చెందినవాడినని, ఇక్కడ బిల్డర్‎గా పని చేస్తున్నానని, తన వద్ద కొంత పురాతన కాలం నాటి బంగారం ఉందని, తక్కువ ధరకు ఇస్తానని తెలిపాడు. ఒక గోల్డ్ కాయిన్ షాప్ ఓనర్‎కు ఇవ్వగా.. జ్యువెలరీ షాప్‎లో టెస్ట్ చేయించగా ఒరిజినల్ గోల్డ్‎గా తేలింది. 

రూ.5 లక్షలు ఇస్తే మరో 22 తులాల గోల్డ్ బిస్కెట్ ఇస్తానని నమ్మించి, డబ్బులు తీసుకుని బిస్కెట్ ఇచ్చాడు. మళ్లీ చెక్ చేయించగా నకిలీదని తేలింది. దీనితో మోసపోయానని బాధితుడు రాజు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సోమవారం నిందితుడు బత్తుల యేసును అరెస్ట్ చేశారు. మహిళ లక్ష్మి పరారీలో ఉంది. వీరు గుంటూరుకు చెందినవారు. నిందితుడి వద్ద రూ. 4 లక్షల నగదు, అర గ్రాము బంగారం, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్‎కు పంపారు. 

మరో కేసులో బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టానని, దాన్ని విడిపిస్తే.. తక్కువ ధరకు అమ్ముతానని జ్యువెలరీ షాప్ ఓనర్‎ను నమ్మించి అంతరాష్ట్ర దొంగ రూ.1. 20 లక్ష కొట్టేశాడు. నల్గొండ పాతబస్తీలోని జ్యువెలరీ షాప్ ఓనర్ బాధితుడు చేపూరి గోపి కిషన్ ఫిర్యాదుతో  పోలీసులు దర్యాప్తు చేపట్టి..  కరీంనగర్ జిల్లా చెందిన పల్లె మధుకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపారు. రెండు కేసులను చాకచక్యంగా ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.