కన్నీటి గాథ..బుజ్జగించ నాన్న లేడు.. లాలించగ అమ్మ రాదు..

కన్నీటి గాథ..బుజ్జగించ నాన్న లేడు.. లాలించగ అమ్మ రాదు..

జగిత్యాల, వెలుగు : జగిత్యాలలో గోవింద్ పల్లెకు చెందిన కొలగాని గంగారెడ్డి-, కమల దంపతులకు కూతురు నాగలక్ష్మి(17) , కొడుకు మల్లికార్జున్ (13) ఉన్నారు. పదేండ్ల క్రితం అనారోగ్యంతో తండ్రి మృతి చెందగా అప్పటి నుంచి కమల కూలీ పని చేస్తూ పిల్లలను పోషిస్తోంది. కష్టపడుతూనే ఇద్దరినీ చదివిస్తోంది. మూడేండ్ల క్రితం ఆమెకు టీబీ  వ్యాధి సోకడంతో మంచాన పడింది. దీంతో తొమ్మిదో తరగతి చదువుతున్న కూతురు నాగలక్ష్మి కుటుంబభారాన్ని భుజాలపై వేసుకుంది. కూలీ పనికి పోతూ తల్లికి వైద్యం అందిస్తూ తమ్ముడు మల్లికార్జున్ ను చదివిస్తోంది. అంతా మంచే జరుగుతుందనుకుంటున్న తరుణంలో తల్లికి వ్యాధి ముదిరింది. దీంతో మందులకు కూడా కూలీ డబ్బులు సరిపోని పరిస్థితి ఎదురైంది. దీంతో నెల క్రితం ఓ మెడికల్​షాపులో పని వెతుక్కుంది. నెల జీతం కింద అమ్మకు మెడిసిన్స్​ తీసుకువెళ్లేది. అయినా నాగలక్ష్మి కష్టం వృథానే అయ్యింది. వ్యాధి ముదరడంతో  సోమవారం అక్కా, తమ్ముడు కలిసి తల్లిని దవాఖానాకు తీసుకువెళ్లారు. అక్కడ ట్రీట్​మెంట్​ తీసుకుంటూ చనిపోయింది. వీరికి నా అన్నవాళ్లు ఎవరూ లేకపోవడంతో అంత్యక్రియలు చేసేందుకు కూడా ఎవరు ముందుకు రాలేదు. దీంతో మాతా శిశు సంక్షేమ శాఖ అధికారి నరేశ్​, డీసీపీఓ హరీష్ అక్కడికి చేరుకొని తక్షణ సాయం కింద 5 వేల క్యాష్​అందజేశారు. చివరికి అనాథ శవంగా మున్సిపల్ కార్మికులు జగిత్యాల సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిల్లలను పరామర్శించారు.

‘అమ్మా… లేమ్మా…

‘అమ్మా…అమ్మా… లేమ్మా…లేచి ఒక్కసారి చూడమ్మా…నాన్న లేని లోటు లేకుండా పెంచావ్​  కదమ్మా..ఇప్పుడు నువ్వు ఇలా మమ్మల్ని వదిలిపెట్టి పోతే మేం ఏమై పోవాలమ్మా…చూడమ్మా….తమ్ముడిని చూడు…వాడి కోసమైనా లేమ్మా..లేదంటే మమ్మల్ని కూడా నీతో తీసుకుపో’ ‘తల్లి శవం వద్ద కూతురు నాగలక్ష్మి’

పిల్లలతో అమ్మ చివరి మాటలు

‘బిడ్డా ఆ దేవుడు నా రాత సక్కగ రాయలేదు. మీ నాన్నను తీస్కపోయిండు. సత్తువ ఉన్నంతవరకు మిమ్మల్ని సాదిన..నువ్వు నా బిడ్డవైనా మంచాల పడ్డ తర్వాత…మా అమ్మ లెక్క చూసుకున్నవ్. కానీ ఏం చేసేదే…ఇగ నేను బతికెటట్టు లేను…నీకు తమ్ముడు…తమ్మునికి నువ్వు. ఎవరింటికి పోవద్దు. కష్టపడి పనిచేసుకోవాలె. తమ్ముడిని మంచిగ చదివించు. అరేయ్​మల్లికార్జునా…అక్కకు పెండ్లి చేసే బాధ్యత నీదే…అక్కనైతే ఇడువకు. ’

ఇల్లు ఖాళీ చెయ్

నాగలక్ష్మి తల్లి కమల ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ఎక్కడ తమ ఇంట్లో చనిపోతుందోనని అరవింద్​నగర్​లోని ఇంటి ఓనర్​ నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించాడు. మానవత్వం లేకుండా ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేయడంతో నాగలక్ష్మి నెలరోజులుగా తిరుగుతూనే ఉంది. లాక్ డౌన్ సమయం కావడంతో ఎవరూ ఇల్లు ఇవ్వడానికి ముందుకు రాలేదు. వారం క్రితం నెలకు రూ.మూడున్నర వేల కిరాయితో ఓ ఇంటిలో రెండు రూములు దొరికాయి. అయితే ఇంట్లో చేరిన రెండు రోజులకే కమల పరిస్థితిని చూసిన అక్కడి యజమాని కూడా ఇల్లు ఖాళీ చేయాలని మంకుపట్టు పట్టాడు. దీంతో సామానంత మూట గట్టుకుని ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నాగలక్ష్మి రూముల కోసం తిరిగింది. అయినా ఎక్కడా దొరకలేదు. సోమవారం తల్లి మాట కూడా పడిపోవడంతో దవాఖానకు తీసుకువెళ్లగా చనిపోయింది. ఇంటి ఓనర్​ రానిస్తడో లేదో అనే ఉద్దేశంతో అంగన్​వాడీ సెంటర్​లో పని చేసే కార్యకర్త ఇంట్లో తలదాచుకున్నారు.