పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో విషాదం

పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో విషాదం

మేడ్చల్ : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మీ కాలనీలో కరెంట్ షాక్ తో ఇద్దరు కూలీలు చనిపోయారు. భాగ్యలక్ష్మీ కాలనీలో నివాసం ఉండే నరేష్ చారి అనే వ్యక్తి.. తమ బిల్డింగ్ పై పూల కుండీల కోసం ఇనుప స్టాండులను అమర్చేందుకు నలుగురు కూలీలను పిలిపించుకున్నాడు. ఈశ్వర్ రావు, చప్పా శ్రీనివాస్ రావు, సాయిబ్ నాయిడు, తాతారావు అనే నలుగురు కూలీలు ఇనుప స్టాండును పైకి తీసుకెళ్తుండగా ఇంటి ముందు ఉన్న కరెంటు తీగలు తగిలి.. షాక్ కొట్టింది. ఈ ఘటనలో ఈశ్వర్ రావు (38), చప్పా శ్రీనివాస్ రావు (43) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయారని డాక్టర్లు చెప్పారు. 

సాయిబ్ నాయిడు, తాతారావు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. బాధితులందరూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారుగా పోలీసులు చెబుతున్నారు.