ఖమ్మం జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఢిల్లీలో జరిగిన మర్కజ్ సమావేశాలకు వెళ్లి వచ్చిన పెద్దతండా కు చెందిన వ్యక్తికి , ఖిల్లా ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి నాలుగు రోజుల క్రితం వైరస్ సోకగా.. తాజాగా వారితో సన్నిహితంగా ఉన్న మరో ఇద్దరికి వైరస్ సోకినట్టు ఆయన తెలిపారు.
.పెద్దతండ ప్రాంతానికి చెందిన వ్యక్తి స్నేహితుడిది మోతీ నగర్ కాగా… ఖిల్లా ప్రాంతానికి చెందిన వృద్ధుడి కోడలికి కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో పెద్దతండా, ఖిల్లా తో పాటు మోతీనగర్ను కూడా కంటైన్మెంట్ జోన్గా గుర్తించారు.
ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఖమ్మం పోలీస్ కమిషనర్ ఇక్బాల్ మాట్లాడుతూ.. శనివారం నుంచి 11గంటలకల్లా లాక్ డౌన్ పూర్తిగా అమలవుతుందని చెప్పారు. 11గంటల తర్వాత ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే అరెస్టు చేస్తామని, కేసు బుక్ చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శుక్రవారం కొంతమంది రూల్స్ అతిక్రమించడడంతో 84 వాహనాలు సీజ్ చేశామని, 34 మంది వ్యక్తులపై కేసు నమోదు చేశామని చెప్పారు.