
- గొంతుకోసి చంపి డెడ్బాడీలను వదిలి వెళ్లిన నక్సల్స్
- చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఘటన
భద్రాచలం, వెలుగు: ఇన్ఫార్మర్లు అనే అనుమానంతో చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఇద్దరు గ్రామస్తులను నక్సల్స్ చంపేశారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. పామేడు పోలీస్స్టేషన్ పరిధిలోని సెండ్రాబోరు గ్రామానికి చెందిన సమ్మయ్య అలియాస్ సందీప్తోపాటు యాంపురం గ్రామానికి చెందిన వేకో దేవాను సాయుధ మావోయిస్టులు కిడ్నాప్ చేసి రెండు గ్రామాల మధ్య ఉన్న అడవిలోకి తీసుకెళ్లారు. వీరిలో సమ్మయ్య మాజీ మావోయిస్టు. ఆర్పీసీ మెంబర్గా పనిచేసి ఇటీవలే జనజీవన స్రవంతిలో కలిశారు.
దేవా సాధారణ గ్రామస్తుడు. వీళ్లిద్దరూ పోలీసులకు తమ దళాల సమాచారం ఇస్తూ, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారంటూ మావోయిస్టులు చితకబాదారు. ప్రజాకోర్టు పెట్టి వారితో చెప్పించారు. అనంతరం గొంతులు కోసి చంపేశారు. వారివారి గ్రామాల సమీపంలో మృతదేహాలను వదిలి వెళ్లారు. గ్రామస్తులు ఆదివారం పామేడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ ఆదేశాలతో ప్రత్యేక బలగాలు స్పాట్కు చేరుకుని డెడ్బాడీలను పోస్ట్మార్టానికి తరలించాయి. ఘటనపై పామేడు పోలీసులు కేసు నమోదు చేశారు.