దీపావళి వేడుకల్లో అపశృతి.. ఇద్దరు యువకులు మృతి

దీపావళి వేడుకల్లో అపశృతి.. ఇద్దరు యువకులు మృతి

దీపావళి పండుగ రోజున పాతబస్తీలో కందికల్ గేట్‎లో విషాదం చోటుచేసుకుంది. పీయూపీ వర్క్ యూనిట్ ఓపెన్ స్థలంలో జరిగిన పేలుళ్లలో వెస్ట్ బెంగాల్‎కు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందగా, ఉత్తర్ ప్రదేశ్‎కు చెందిన మరో యువకుడు తీవ్ర గాయాలపాలై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

పాతబస్తీ కందికల్ గేట్ ప్రాంతంలో ఉల్లాస్ అనే వ్యక్తి గత కొంత కాలంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ (పీయుపీ) బొమ్మలు తయారు చేసే యూనిట్‎ను నడుపుతున్నాడు. దీపావళి పూజ అనంతరం కొన్ని టపాసులను ఆ యూనిట్‎లో పనిచేసే వెస్ట్ బెంగాల్‎కు చెందిన విష్ణు (25), జగన్ (30), ఉత్తర్ ప్రదేశ్‎కు చెందిన బీరెన్ (25) అనే కార్మికులకు ఇచ్చి వెళ్ళిపోయాడు. కార్మికులు పటాకులు కాల్చుతుండగా అర్థరాత్రి ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ పేలుడులో విష్ణు, జగన్‎లు అక్కడికక్కడే మృతి చెందగా.. బీరెన్ తీవ్ర గాయాలపాలయ్యాడు. పేలుడు శబ్దానికి ఉలిక్కిపడ్డ స్థానికులు ఛత్రినాక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న ఫలక్‎నుమా ఏసీపీ మాజిద్, ఇన్‎స్పెక్టర్ దేవేందర్, ఛత్రినాక ఇన్‎స్పెక్టర్ ఖాదర్ జిలాని పరిస్థితిని సమీక్షించారు. తీవ్రంగా గాయపడిన బీరెన్‎ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలికి క్లూస్ టీమ్‎ను రప్పించి ఆధారాలు సేకరించారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పేలుడు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.