కరోనా వైరస్ ను వుహాన్ లో అమెరికా సైనికులే వ్యాప్తి చేసి ఉంటారంటూ చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జావో లిజియన్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. ఈ ట్వీట్ పై అమెరికా సీరియస్ అయ్యింది. వివరణ ఇవ్వాలంటూ అమెరికాలోని చైనా రాయబారి సూయీ టియాంకాయికి నోటీసులు ఇష్యూ చేసింది. ‘‘తమ ద్వారా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా విషయంలో వచ్చే విమర్శలను తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారు. వైరస్ గురించి ముందే ఎందుకు చెప్పలేదు’’ అని అమెరికా ఏషియా వ్యవహారాల అంబాసిడర్ స్టిల్ వెల్ చెప్పారు. వుహాన్ లో కరోనా కు అమెరికా సైనికులే కారణమంటూ జావో లిజియన్ చేసిన ట్వీట్ చైనాలో వైరల్ గా మారింది. ‘‘వుహాన్ కు కరోనాను తెచ్చింది యూఎస్ సైన్యం కావచ్చు. దీనిపై యూఎస్ మాకు వివరణ ఇవ్వాలి’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఇది అమెరికా కుట్రేనంటూ చైనాలో ప్రచారం మొదలైంది.
యూఎస్ కరోనా రిలీఫ్ బిల్లు
కరోనాను కంట్రోల్ చేసేందుకు అమెరికా మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. కరోనా అనుమానితులకు ఫ్రీ టెస్టులు, వైరస్ సోకిన వారికి పేమెంట్తో కూడిన సెలవులు, అన్ ఎంప్లాయీస్కు ఇన్సూరెన్స్ వంటి అంశాలతో రూపొందించిన బిల్లును అమెరికా సర్కార్ శనివారం ఆమోదించింది. హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్లోనూ కరోనా ట్రీట్మెంట్ను చేర్చాలని ఆదేశాలిచ్చింది. కరోనా టెస్టులు, ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, సదరు ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇక ఇన్సూరెన్స్ లేని వాళ్ల కోసం 7 వేల 200 కోట్లను అదనంగా కేటాయిస్తున్నట్టు వైట్ హౌస్ తెలిపింది.
