
- రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్.. 40 యుద్ధ విమానాల పేల్చివేత
- సైబీరియాలోని ఎయిర్ బేస్లపై భీకర దాడులు
- టార్గెట్లపైకి దూసుకెళ్లి పేల్చేసిన ఏఐ ఆటోనామస్ డ్రోన్ లు
- దాడికి సంబంధించిన వీడియోలూ విడుదల
- బార్డర్ నుంచి ఏకంగా వేల కి.మీ. దూరంలో ఉక్రెయిన్ దాడులు
- దక్షిణ రష్యాలో కూలిన రెండు బ్రిడ్జిలు.. పట్టాలు తప్పిన రైళ్లు
కీవ్/మాస్కో: రష్యాపై ఉక్రెయిన్ ఆదివారం భారీ ఎత్తున డ్రోన్ దాడులు చేసింది. కార్గో కంటైనర్లలో రష్యా భూభాగంలోకి ఏఐ ఆటోనామస్ డ్రోన్ లను పంపి ఎయిర్ బేస్ లలో నిలిపి ఉంచిన 40 బాంబర్ విమానాలను పేల్చేసింది. యుద్ధ విమానాలను పేల్చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలను సైతం ఉక్రెయిన్ విడుదల చేసింది. ఉక్రెయిన్ బార్డర్ నుంచి ఏకంగా రెండు, మూడు వేల కిలోమీటర్ల దూరంలో రష్యా భూభాగంలోని ఎయిర్ బేస్ లపై ఈ దాడులు జరిగాయి. మూడేండ్ల క్రితం యుద్ధం మొదలైనప్పటి నుంచీ ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్లో రష్యాకు ఇంత పెద్ద నష్టం వాటిల్లడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్ పైకి లాంగ్ రేంజ్ మిసైల్స్ ను ప్రయోగించేందుకు వీలుగా సుదూర ప్రాంతంలో మోహరించిన టీయూ95, టీయూ22 బాంబర్ విమానాలను, ఒక ఏ50 నిఘా విమానాన్ని పేల్చివేసినట్టు ఈ మేరకు ఉక్రెయిన్ ఆర్మీ అధికారులు వెల్లడించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. రష్యాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలోని స్రెడ్నీ వద్ద ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేసినట్టు స్థానిక గవర్నర్ ఇగోర్ కోబ్జెవ్ కూడా ధ్రువీకరించారని పేర్కొంది. ముర్మాన్స్క్ రీజియన్ లోని ఒలెన్యా, ఇర్కుట్స్క్ రీజియన్ లోని బెలాయా ఎయిర్ బేస్ లపై డ్రోన్ దాడులతో భారీగా పేలుళ్లు సంభవించాయని, పెద్ద ఎత్తున పొగలు వెలువడ్డాయని వివరించింది. పవుటినా (స్పైడర్ వెబ్) అనే కోడ్ నేమ్తో ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్టుగా వెల్లడించింది. అయితే, ఈ డ్రోన్ దాడుల్లో ప్రాణ నష్టానికి సంబంధించి రష్యా నుంచి ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు.
రష్యాలో కూలిన రెండు రైల్వే బ్రిడ్జిలు..
ఉక్రెయిన్ బార్డర్ కు సమీపంలో, రష్యా దక్షిణ ప్రాంతంలోని బ్రయాన్స్క్, కురుస్క్ రీజియన్లలో శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున రెండు బ్రిడ్జిలు కూలిపోయి రైళ్లు పట్టాలు తప్పాయి. ముందుగా శనివారం రాత్రి 10.50 గంటలకు బ్రయాన్స్క్ రీజియన్ లో ఓ రోడ్డు బ్రిడ్జి కూలిపోయి కిందుగా వెళ్తున్న ప్యాసింజర్ ట్రెయిన్ పై పడింది. దీంతో ట్రెయిన్ పట్టాలు తప్పి బోగీలు చెల్లాచెదురు అయ్యాయి. తర్వాత ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు కురుస్క్ రీజియన్ లో ఓ రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో ఆ మార్గంలో వెళ్తున్న గూడ్స్ ట్రెయిన్ పట్టాలు తప్పింది. ఈ రెండు ఘటనల్లో కలిపి ఏడుగురు చనిపోగా, 69 మంది గాయపడ్డారని రష్యన్ అధికారులు తెలిపారు. అయితే, రెండు చోట్లా బ్రిడ్జిలను పేల్చివేయడం వల్లే కూలిపోయినట్టుగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
రష్యా దాడిలో 12 మంది ఉక్రెయిన్ జవాన్లు మృతి
ఉక్రెయిన్ లోని ఓ ఆర్మీ ట్రెయినింగ్ క్యాంప్ పై రష్యా మిసైల్ దాడి చేయడంతో 12 మంది ఉక్రెయిన్ జవాన్లు మృతిచెందారు. 60కిపైగా సోల్జర్లు గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ దాడి జరిగిందని, ఆ సమయంలో ట్రెయినింగ్ సెషన్ లేకపోవడంతో జవాన్లు ఒకే చోటకు గ్యాదర్ కాలేదని ఈ మేరకు ఉక్రెయినియన్ గ్రౌండ్ ఫోర్సెస్ తెలిపింది. అయితే, ఈ ట్రెయినింగ్ క్యాంప్ ఉన్న ప్రాంతం వివరాలను మాత్రం వెల్లడించలేదు.
కార్గో కంటైనర్లలో డ్రోన్లను పంపి..
ఉక్రెయిన్ నిఘా వర్గాలు కార్గో కంటైనర్లలో ఏఐ ఆటోనామస్ డ్రోన్లను బార్డర్ నుంచి వేల కిలోమీటర్ల దూరంలో, రష్యా భూభాగంలో ఉన్న ఎయిర్ బేస్ల సమీపంలోకి చేర్చినట్టుగా మీడియా కథనాలు వచ్చాయి. రష్యాలోని ఓ హైవే పక్కన నిలిపి ఉంచిన ట్రక్కులపై కంటైనర్ల నుంచి డ్రోన్లు పైకి ఎగురు తున్న దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. ఓ ట్రక్కు డ్రైవర్ను అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే, వారం కిందట రష్యా ఒకేసారి 367 డ్రోన్లు, మిసైళ్లతో ఉక్రెయిన్ సిటీలపై విరుచుకుపడగా.. 13 మంది చనిపోయారు. వీటిలో 266 డ్రోన్లు, 45 మిసైల్స్ను పేల్చివేశామ ని ఉక్రెయిన్ తెలిపింది. తాజాగా బార్డర్ నుంచి ఏకంగా 2, 3 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒలెన్యా, బెలాయా ఎయిర్ బేస్లపై ఉక్రెయిన్ దాడి చేయడం రష్యాకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. దీంతో రష్యా మరింత తీవ్ర స్థాయిలో ఉక్రెయిన్ పై విరుచుకుపడే అవకాశం ఉందని సమాచారం.