మానవతా సాయం కోరుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రష్యా దాడితో సంక్షోభంలో చిక్కుకుపోయిన ఉక్రెయిన్.. సాయం కోసం భారత్ కు అభ్యర్థన చేసింది. ఈ లేఖ గురించి భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఏడాదికిపైగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ ఉప మంత్రి ఎమినే జపరోవా (Emine Dzhaparova) భారత్లో పర్యటిస్తున్నారు. ప్రధాని మోడీని ఉద్దేశించి జెలెన్స్కీ(Zelensky) రాసిన లేఖను ఆమె విదేశాంగ శాఖకు అందించారు. వైద్య సామాగ్రి వంటి అదనపు మానవతా సాయం అందించాలని లేఖలో కోరారు. అందుకు భారత్ ముందుకువచ్చిందని వెల్లడిస్తూ మన విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ట్విటర్లో స్పందించారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్ నుంచి ఎమినే జపరోవా మరింత సహకారాన్ని కోరారు. ప్రధాని మోడీ, ఇతర ఉన్నతాధికారులు తమ దేశంలో పర్యటించాలని కోరారు. అయితే.. ఇతర దేశాలతో భారత్కు ఉన్న సంబంధాల విషయంలో సూచనలు చేసే స్థితిలో తమ దేశం లేదన్నారు. రష్యా నుంచి భారత్ భారీ స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటోన్న విషయం తెలిసిందే. యుద్ధం మొదలైన దగ్గరి నుంచి ఈ దిగుమతులు పెరిగాయి.