అమెరికాలో ఘటన..
సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
వాషింగ్టన్: మనకు తెలవనోళ్ల కారు డ్యామేజ్ చేస్తే, ముందు.. వెనుక చూసి ఎవరూ లేకపోతే అక్కడి నుంచి జారుకుంటాం. కానీ ఓ వ్యక్తి మాత్రం.. తన వల్ల కారు ఓనర్ లాస్ కావొద్దని భావించి.. ‘సారీ’ లెటర్తో పాటు 100 డాలర్లు పెట్టి మరీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీన్ని చూసిన ఓనర్కు కోపం వచ్చింది. పోలీసులకు కంప్లైంట్ చేయగా, వారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ ఘటన అమెరికా.. ఫ్లోరిడాలోని డిస్నీ వరల్డ్ వద్ద జరిగింది.
‘‘బే లేక్.. వాల్ట్ డిస్నీ వరల్డ్ రిసార్ట్లోని ఎప్కాట్ థీమ్ పార్క్కు ఒకతను కారు తీసుకొని వచ్చాడు. అక్కడ హాన్సన్ షో చూసి ఎంజాయ్ చేశాడు. తిరిగి వచ్చి చూస్తే అతని కారు డ్యామేజ్ అయి ఉంది. ఎవరు చేశారో తెలీదు. డ్యామేజ్ చేసినందుకు ఓ సారీ లెటర్, 100 డాలర్లు పెట్టి వెళ్లాడు. లెటర్లో పేరు మాత్రం లేదు”అని డిస్నీ థీమ్పార్క్స్ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ పోస్టు చాలా వైరల్ అయ్యింది.
ఒక్కో నెటిజన్ ఒక్కోలా స్పందిస్తున్నారు. కొందరు కారు ఓనర్పై జాలి చూపిస్తుంటే.. మరికొందరు డ్యామేజ్ చేసిన వ్యక్తిని తప్పుబడుతున్నారు. ‘‘మీరు వెంటనే సెక్యురిటీ కెమెరాలు చెక్ చేసి.. పోలీసులకు కంప్లైంట్ చేయండి” అని ఓ నెటిజన్ అంటే.. అది కూడా చేశామని, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని ఓనర్ రిప్లై ఇచ్చాడు. ‘‘అవతలి వ్యక్తి తాగి డ్రైవ్ చేయడంతోనే మీ కారు డ్యామేజీ అయింది” అని ఒకరంటే.. ఓవర్ స్పీడ్ కారణమని మరో యూజర్ కామెంట్ చేశాడు.