5 రీజినల్ మెడికల్ హబ్స్.. బడ్జెట్‌‌‌‌లో కొత్త స్కీమ్‌‌‌‌ ను ప్రకటించిన కేంద్రం

5 రీజినల్ మెడికల్ హబ్స్.. బడ్జెట్‌‌‌‌లో కొత్త స్కీమ్‌‌‌‌ ను ప్రకటించిన కేంద్రం
  • పీపీపీ పద్ధతిలో ఏర్పాటుకు రాష్ట్రాలకు సహకారం
  • వచ్చే ఐదేండ్లలో కొత్తగా లక్ష ఏహెచ్‌‌‌‌పీ ఇనిస్టిట్యూట్లు 
  • 1.5 లక్షల మంది కేర్‌‌‌‌‌‌‌‌గివర్స్‌‌‌‌కు ట్రైనింగ్‌‌‌‌
  • ఆరోగ్య శాఖకు రూ.1.06 లక్షల కోట్లు కేటాయింపు 

న్యూఢిల్లీ: బడ్జెట్‌‌‌‌లో ఆరోగ్య శాఖకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. గతేడాదితో పోలిస్తే 10% నిధులను పెంచింది. ఈసారి మొత్తం రూ.1.06 లక్షల కోట్లు కేటాయించింది. ఇందులో హెల్త్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు రూ.1.01 లక్షల కోట్లు, హెల్త్ రీసెర్చ్‌‌‌‌కు రూ.4,821 కోట్లు అలాకేట్ చేసింది. దేశాన్ని మెడికల్ టూరిజం డెస్టినేషన్‌‌‌‌గా మార్చడమే లక్ష్యంగా 5 రీజినల్ మెడికల్ హబ్స్ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. 

ఇందుకోసం ప్రత్యేక పథకం తేనున్నట్టు వెల్లడించింది. వీటిని రాష్ట్రాల సహకారంతో పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ పద్ధతిలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఈ మెడికల్ హబ్స్‌‌‌‌లో మెడికల్, ఎడ్యుకేషనల్, రీసెర్చ్ సౌలతులు ఉంటాయని పేర్కొంది. వైద్యం, వైద్య విద్య అందించడంతో పాటు పరిశోధనలు చేసేందుకు వీలుగా ఈ కేంద్రాలు ఉంటాయని వివరించింది.
 
ప్రస్తుతమున్న ఏహెచ్‌‌‌‌పీలు అప్‌‌‌‌గ్రేడ్.. 

అలైడ్ హెల్త్‌‌‌‌కేర్ ప్రొఫెషనల్స్‌‌‌‌ (ఏహెచ్‌‌‌‌పీ)కు డిమాండ్ పెరుగుతుండడంతో ఈ రంగంపై కేంద్రం ప్రధానంగా దృష్టిపెట్టింది. ప్రస్తుతమున్న అలైడ్ హెల్త్‌‌‌‌కేర్ ప్రొఫెషనల్స్‌‌‌‌ ఇనిస్టిట్యూట్లను అప్‌‌‌‌గ్రేడ్ చేయడంతో పాటు కొత్తవి ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌‌‌‌లో ప్రకటించింది. వచ్చే ఐదేండ్లలో లక్ష ఏహెచ్‌‌‌‌పీ ఇనిస్టిట్యూట్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. వీటిని గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేస్తామని తెలిపింది. 

వీటిల్లో ఆప్టోమెట్రీ, రేడియాలజీ, అనస్థీషియా, ఓటీ టెక్నాలజీ, అప్లయ్‌‌‌‌డ్‌‌‌‌ సైకాలజీ, బిహేవియరల్ హెల్త్ తదితర డిపార్ట్‌‌‌‌మెంట్లు ఉంటాయని వివరించింది. తొలిసారి అలైడ్ హెల్త్‌‌‌‌కేర్ ప్రొఫెషనల్స్‌‌‌‌ (ఏహెచ్‌‌‌‌పీ) స్కీమ్‌‌‌‌కు బడ్జెట్‌‌‌‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. అలాగే వెల్‌‌‌‌నెస్, యోగా తదితర డిపార్ట్‌‌‌‌మెంట్లలో భవిష్యత్తులో 1.5 లక్షల మంది కేర్‌‌‌‌‌‌‌‌గివర్స్‌‌‌‌కు ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. 

పథకాలకు నిధులు పెంపు.. 

ఆరోగ్య శాఖలోని కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఈసారి నిధులు పెంచారు. నేషనల్ హెల్త్ మిషన్‌‌‌‌కు పోయినేడాది రూ.37,100 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.39,390 కోట్లు కేటాయించారు. ఆయుష్మాన్‌‌‌‌ భారత్‌‌‌‌ స్కీమ్‌‌‌‌కు పోయినేడాది రూ.8,995 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.9,500 కోట్లు కేటాయించారు. నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌‌‌‌కు పోయినేడాది రూ.45 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.51 కోట్లు కేటాయించారు. 

నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌‌‌‌కు పోయినసారి రూ.324.26 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.350 కోట్లకు పెంచారు. ఢిల్లీ ఎయిమ్స్‌‌‌‌కు పోయినేడాది రూ.5,238.70 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.5,500.92 కోట్లు కేటాయించారు. ఇక ఐసీఎంఆర్‌‌‌‌‌‌‌‌కు 10 శాతం నిధులు పెంచుతూ రూ.4,821.21 కోట్లు అలాకేట్ చేశారు. 

ఆరోగ్య శాఖలో ముఖ్యమైన కేటాయింపులు ఇలా (రూ.కోట్లలో)... 

  • మొత్తం                          1,06,530.42
  • నేషనల్ హెల్త్ మిషన్     39,390
  • ఆయుష్మాన్ భారత్          9,500 
  • ఢిల్లీ ఎయిమ్స్                5,500.92 
  • ఐసీఎంఆర్                     4,821.21  
  • అలైడ్ హెల్త్‌‌‌‌కేర్ ప్రొఫెషనల్స్‌‌‌‌ స్కీమ్‌‌‌‌     1,000