SPG రూల్స్ ను సోనియా ఫ్యామిలీ బ్రేక్ చేయడం వల్లే తీసేశాం…

SPG రూల్స్ ను సోనియా ఫ్యామిలీ బ్రేక్ చేయడం వల్లే తీసేశాం…

సోనియా ఫ్యామిలీకి SPG భద్రత తొలగించడం వివాదమవుతోంది. కేంద్ర సర్కార్ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపడుతుండగా.. సోనియా కుటుంబ సభ్యులే SPG రూల్స్ ను ఉల్లంఘిస్తున్నారని హోంశాఖ తెలిపింది. గత నాలుగేళ్లలోనే రాహుల్ గాంధీ 18 వందల 92 సార్లు రూల్స్ బ్రేక్ చేశారని ఆధారాలతో సహా లెక్కలు చెప్పింది. మరోవైపు SPG భద్రతా దళానికి కృతజ్ఞతలు చెబుతూ లేఖ రాశారు సోనియా..

గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగించడాన్ని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. మోడీ సర్కార్ నిర్ణయంపై ఆ పార్టీ నేతలు గరమైతున్నారు, అయితే  ఎస్పీజీ మాత్రం ఆధారాలతో వివరణ ఇచ్చింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకలు పలు సార్లు ఎస్పీజీ నియమాలను ఉల్లంఘించారని తెలిపింది. కొన్నాళ్లుగా గాంధీ కుటుంబీకులు భద్రతా సిబ్బందికి సహకరించడం లేదని తెలిపింది ఎస్పీజీ. 2015 నుంచి 2019 వరకు రాహుల్ గాంధీ 1892  సార్లు రూల్స్ పాటించలేదని  ప్రకటించింది.

ఎస్పీజీ లెక్కల ప్రకారం సగటున రోజుకు ఒకసారి రాహుల్ రూల్స్ ఉల్లంఘించారు. బుల్లెట్ రెసిస్టెంట్ వాహనాన్ని తిరస్కరించి ఒకసారి ఢిల్లీలో తిరిగారు. 250 సార్లు నాన్ బుల్లెట్ వాహనంలో ఢిల్లీ బయట జర్నీ చేశారు. విదేశీ పర్యటనల్లోనూ రాహుల్ ఎస్పీజీ రూల్స్ పాటించలేదంటోంది కేంద్ర హోంశాఖ . 1991 నుంచి రాహుల్ 156 సార్లు విదేశీ పర్యటనకు వెళ్లగా.. అందులో 143 సార్లు ఎస్పీజీ అధికారులు లేకుండానే వెళ్లారని తెలిపింది. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కలిసి.. 389 సార్లు బుల్లెట్ ప్రూవ్ వాహనం లేకుండానే ప్రయాణించారని హోంశాఖ వర్గాలు చెప్పాయి.

1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఘటన తర్వాత నుంచి సోనియాతో పాటు రాహుల్, ప్రియాంకకు ఎస్పీజీ భద్రత కల్పిస్తున్నారు. 28 ఏళ్ల నుంచి ఆ కుటుంబానికి సెక్యూరిటీ కొనసాగుతోంది. అయితే నాయకులకు కేటాయించే వ్యక్తిగత భద్రతపై ఐదేళ్లకోసారి జరిగే సమీక్షలో భాగంగా గాంధీ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ఎస్పీజీ భద్రత తొలగించింది. ఇక నుంచి సోనియా కుటుంబానికి జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉండనుంది. ఇందులో భాగంగా సుమారు 100 మంది CRPF Pజవాన్లు గాంధీ కుటుంబానికి రక్షణగా ఉండనున్నారు.

మరోవైపు ఎస్పీజీ భద్రతా దళానికి కృతజ్ఞతలు చెప్పారు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ.  ఎస్పీజీ చీఫ్ అరుణ్ సిన్హాకు ఆమె లేఖ రాశారు. అంకిత భావం, విచక్షణతో సుదీర్ఘ కాలం తమ కుటుంబ భద్రత కోసం సెవలందించారని ఆమె ప్రసంశించారు. ఎస్పీజీ ఉండటం వల్లే 28 ఏళ్లుగా తామ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించామని చెప్పారు. ఎస్పీజీ సైనికులకు దేశభక్తితో పాటు ఇచ్చిన పనిని ఖచ్చితంగా చేసే సామర్ధ్యం ఉంటుందని లేఖలో సోనియాగాంధీ కొనియాడారు.