
న్యూఢిల్లీ: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దేశ జనాభా గణన ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా 2025, జూన్ 16న జన గణనపై కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం రెండు విడతల్లో కుల గణన నిర్వహించనున్నట్లు గెజిట్లో తెలిపింది. 2026 అక్టోబర్ 1నాటికి జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్లో జన గణన పూర్తి చేయనున్నట్లు పేర్కొంది.
2027 మార్చి 1 నాటికి మిగిలిన రాష్ట్రాల్లో జన గణన కంప్లీట్ చేస్తామని వెల్లడించింది. జన గణనతో పాటే కుల గణన చేయాలని ఇదివరకే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ప్రకారం.. జనగణనతో పాటు కుల గణన వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వం సేకరించనుంది. ఇది దేశంలో15 ఏళ్ల తర్వాత జరుగుతున్న జన గణన.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జన గణనపై ఆదివారం (జూన్ 15) సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 16వ జనాభా గణన 2027లో జరగనుంది. మొత్తం రెండు దశల్లో జనాభాగణన జరగనుంది. మొదటి దశలో ఇంటి జాబితా ఆపరేషన్ ద్వారా గృహాల పరిస్థితి, ఆస్తులు, సదుపాయాలకు సంబంధించిన వివరాలు సేకరించనున్నారు. రెండవ దశలో జనాభా గణన చేస్తారు. ప్రతి వ్యక్తికి సంబంధించిన జనాభా, సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక, ఇతర వివరాలు సేకరిస్తారు. ఇందులో కులగణన కూడా నిర్వహించనున్నారు.
కుల గణన: 1931 తర్వాత తొలిసారిగా జన గణనలో కులాల వివరాలు కూడా సేకరించనున్నారు. ఈసారి జనాభా గణన డిజిటల్ పద్ధతిలో మొబైల్ అప్లికేషన్ల ద్వారా నిర్వహించునున్నారు. ప్రజలు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ భారీ ప్రక్రియ కోసం సుమారు 34 లక్షల ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు1.3 లక్షల మంది ఇతర సిబ్బంది పాల్గొననున్నారు.
నిధులు: జనాభా గణన ప్రక్రియకు రూ.13 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది స్వాతంత్ర్యం తర్వాత 8వ జన గణన. మొత్తం మీద 16వ జన గణన. చివరగా దేశంలో జనగణన 2011లో జరిగింది. 2021లో జరగాల్సిన జన గణన కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది.