
- ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసింది
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్
కరీంనగర్, వెలుగు : తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో సుమారు రూ.10 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను పూర్తిగా దివాలా తీయించారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ విమర్శించారు. లక్షల కోట్ల అప్పు చేసినా రాష్ట్ర ప్రజల బతుకులు మాత్రం మారలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం కరీంనగర్లోని ఎంపీ ఆఫీస్లో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్లు సునీల్రావు, డి.శంకర్తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆరు గ్యారంటీలు సహా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ రెండు పార్టీల పాలన, అవినీతి వల్ల అప్పు కూడా పుట్టని పరిస్థితికి తెలంగాణను దిగజార్చారన్నారు. ‘తెలంగాణ ఏర్పడి 11 ఏండ్లు అయినా ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదు, తెలంగాణ ప్రజల బతుకులు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. తెలంగాణ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారింది, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో సాధించింది గుండు సున్నా.. కాంగ్రెస్ భాషలో చెప్పాలంటే గాడిద గుడ్డు’ అని విమర్శించారు.