ముషీరాబాద్, వెలుగు : ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను రక్షించుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని మహంకాళి ఆలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ మాజీ కమిషనర్ రాథోడ్ మోహన్ నాయక్ ఐఆర్ఎస్ మాజీ అధికారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి . కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మోహన్ నాయక్ను కండువా కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం మోహన్ నాయక్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల హిందువుల కల అయినా అయోధ్య రామాలయం నిర్మించి దేశాభివృద్ధే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్తో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నేతి రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
నేడు కొమురవెల్లి రైల్వేస్టేషన్ శంకుస్థాపన
సికింద్రాబాద్ : మల్లన్న భక్తుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం కొమురవెల్లిలో నిర్మించ తలపెట్టిన రైల్వేస్టేషన్ కు గురువారం శంకుస్థాపన జరగనుంది. కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డితో పాటు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ,రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ కూడా హాజరుకానున్నారు. ఈ మార్గంలో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కొత్త రైల్వే లైను మంజూరు చేసింది. పనులు కూడా పూర్తయ్యాయి.