
- ప్రపంచమే ఆశ్చర్యపోయేలా మహిళా బిల్లు
- మహిళా బిల్లు పాస్ అయినందుకు గన్ పార్క్ నుంచి పార్టీ ఆఫీసు వరకు ర్యాలీ
హైదరాబాద్, వెలుగు: ప్రపంచమే ఆశ్చర్యపోయేలా దేశంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం కల్పించిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కొత్త పార్లమెంట్ బిల్డింగులో మొదటి బిల్లుగా ‘నారీ శక్తి వందన్ అధినియం’ను ఆమోదించడం చరిత్రాత్మకమని చెప్పారు. మహిళా బిల్లు పాసైన నేపథ్యంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆదివారం గన్పార్క్లోని అమరుల స్థూపం నుంచి నాంపల్లిలోని బీజేపీ ఆఫీసు వరకు ర్యాలీ తీశారు.
తొలుత అమరులకు నివాళులర్పించి.. తర్వాత ఎంపీ లక్ష్మణ్, జయసుధ, ఇతర మహిళా నేతలు, పార్టీ కేడర్తో కలిసి కిషన్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. 60 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ.. కేవలం కాలం వెళ్లదీసిందని ఆరోపించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి 75 ఏండ్ల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని చెప్పారు.
కేసీఆర్ తొలి కేబినెట్లో ఒక్క మహిళా లేరు
రాష్ట్రానికి తొలి సీఎంగా ప్రమాణం చేసిన కేసీఆర్.. తన కేబినెట్లో మహిళలకు సరైన స్థానం కల్పించలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఫస్ట్ కేబినెట్లో ఒక్క మహిళకూ చోటు ఇవ్వలేదని ఆరోపించారు. కేసీఆర్ గురువు అసదుద్దీన్ ఒవైసీ అని విమర్శించారు. పార్లమెంట్లో మహిళా బిల్లును వ్యతిరేకించిన ఏకైక పార్టీ మజ్లిస్ అని, అలాంటి పార్టీతో అంటకాగుతన్న కేసీఆర్.. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు కూడా మహిళా బిల్లుపై ఓటింగ్లో పాల్గొనకుండా తప్పించుకున్నారని ఆరోపించారు.
నవ భారత నిర్మాణం కోసం కృషి: లక్ష్మణ్న
వ భారత నిర్మాణం కోసం ప్రధాని కృషి చేస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి మహిళా బిల్లును పాస్ చేయించిన ఘనత మోదీదన్నారు. మహిళా బిల్లుకు ఓటు వేయడంతో తన జీవితం ధన్యమైందన్నారు. ఓబీసీ పేరుతో రాహుల్ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. జనాభా లెక్కలు పూర్తయ్యాక రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు.