కేసీఆర్ వి ఉత్తర కుమార ప్రగల్భాలు

కేసీఆర్ వి ఉత్తర కుమార ప్రగల్భాలు

బయ్యారంలో స్టీల్ ప్లాంట్ విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం వీధి నాటకాలు ఆడుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టడం సాధ్యం కాదని టాస్క్ ఫోర్స్ కమిటీ స్పష్టం చేసిందన్నారు. 200 టన్నుల ఇనుప నిక్షేపాలు ఉంటేనే స్టీల్ ప్లాంట్ పెట్టాలనే నిబంధన ఉందన్నారు.  స్టీల్ ప్లాంట్ పెడితే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉందని టాస్క్ ఫోర్స్ కమిటీ చాలా స్పష్టంగా పేర్కొందని చెప్పారు. ప్రజా సమస్యలను, పరిపాలనను కేసీఆర్ గాలికి వదిలేసి రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం కేంద్రంపై, బీజేపీపై కేసీఆర్ కుటుంబ సభ్యులు విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాజకీయంగా కేసీఆర్ కుటుంబపై పెరుగుతున్న వ్యతిరేకతతో బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై అర్ధ రహిత విమర్శలు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేంద్రం సహకరించకపోయినా స్టీల్ ప్లాంట్ పెడుతామని 2018లో కేసీఆర్ చెప్పారని, దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. స్టీల్ ప్లాంట్ పెట్టి10 నుంచి 15వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఏనాడు చెప్పలేదని, కేసీఆర్ కుటుంబమే హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టడం సాధ్యం కాదని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తేలిందన్నారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెడితే అంతర్జాతీయ పోటీని తట్టుకోలేమన్నారు.

రాష్ట్రంలో లిక్కర్, ల్యాండ్, ఇసుక, మైనింగ్ మాఫియా నడుస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పి.. అప్పుల తెలంగాణగా మార్చారని అన్నారు. ‘తెలంగాణ మోడల్ అంటే సెక్రటేరియట్ కు ముఖ్యమంత్రి రాకుండా ఉండడం మోడలా..? ఉన్న సెక్రటేరియట్ ను కూలగొట్టడం మోడలా..? టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళా ఎమ్మెల్యేలు మంత్రులుగా లేకపోవడం తెలంగాణ మోడలా..? సీఎం కేసీఆర్ సగం రోజులు ప్రగతిభవన్ లో.. సగం రోజులు ఫాంహౌజ్ లో ఉంటారు. మిమ్ములను దేశ ప్రజలు ఏం చూసి స్వాగతం పలుకుతారు’ అని వ్యాఖ్యానించారు. 

కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొందరు తెలంగాణ ఉద్యమకారులు బాధపడుతున్నారని
ఒక కుటుంబం కోసం ఉద్యమాలు చేశామా..? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. త్రిబుల్ ఐటీ విద్యార్థులు ఆత్మహత్యలు, గురుకులాల విద్యార్థులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం విద్యారంగం దయనీయమైన పరిస్థితిలో ఉందన్నారు. ఇప్పటి వరకూ తెలంగాణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ‘స్వచ్ఛ మిషన్’ కింద అవార్డు ఇచ్చామని చెప్పారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై వివక్షత ఉంటే అవార్డులు ఎందుకు ఇస్తుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. కేసీఆర్ కటుంబం, టీఆర్ఎస్ నేతల దోపిడీ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్నారు. గిరిజనులకు పోడు భూములను ఏడాది లోపు ఇస్తామని 2018లో చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మున్సిపల్ కాంట్రాక్టర్స్ కూడా పెండింగ్ బకాయిల కోసం జీహెచ్ఎంసీ ఆఫీసు ఎదుట ధర్నాలు చేసే పరిస్థితులు ఎందుకు వచ్చాయన్నారు.