నారాయణగూడ మహాపడి పూజలో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

నారాయణగూడ మహాపడి పూజలో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: అయ్యప్ప స్వామి దీక్షతో ఆధ్యాత్మికత, సేవా గుణాలు అలవడుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాలధారణతో లక్షల మంది భక్తులు తమ జీవితాలను మార్చుకుంటున్నారని చెప్పారు. ఆదివారం హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇంజినీరింగ్ కాలేజీలో కిషన్ రెడ్డి దంపతులు అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. 22 ఏండ్లుగా మహాపడి పూజను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. అయ్యప్ప దీవెనలు తెలంగాణ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

గురుస్వామి ఆత్రేయ ఆచార్యులు మహాపడి పూజకు నేతృత్వం వహించారు. సిరిసిల్ల భజన బృందానికి చెందిన జడల రమేశ్ భక్తి గీతాలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ లక్ష్మణ్, ఎమ్మల్యే ముఠా గోపాల్, బీజేపీ సీనియర్ నేతలు ఇంద్రసేనా రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, విజయశాంతి, నందీశ్వర్​గౌడ్, దిలీప్ కుమార్, పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి తదితరులు పాల్గొన్నారు.