
నిజామాబాద్: స్టేట్ పాలిటిక్స్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం (జూన్ 26) నిజామాబాద్ జిల్లాలో కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసింది పోలీస్ వ్యవస్థనే కాబట్టి.. ఈ కేసు విచారణ పారదర్శకంగా జరగాలంటే సీబీఐకి అప్పగించాలన్నారు. పోలీసుల మీదనే పోలీసులు దర్యాప్తు జరిపితే ఎలా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్తో కుమ్ముక్కు కాలేదని సీఎం రేవంత్ భావిస్తే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలని సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ ఇప్పటికే కోర్టును ఆశ్రయించిందని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటుందని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా దుర్మార్గంగా వ్యవహరించి వ్యక్తుల వ్యక్తిగత భద్రతను దెబ్బతీశారని ఫైర్ అయ్యారు.
బీజేపీ ఎంపీ అర్వింద్ చొరవ, కృషితో ప్రధాని మోడీ నిజామాబాద్లో పసుపు బోర్డును ప్రకటించారన్నారు. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ తదితర రాష్ట్రాల సీఎంలు పసుపు బోర్డు వారి రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని కోరినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలోనే ఏర్పాటు చేసిందన్నారు. పసుపు బోర్డు చైర్మన్గా నిజామాబాద్కు చెందిన పల్లె గంగారెడ్డిని నియమించారని పేర్కొన్నారు. పసుపు రైతుల్లో జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. పసుపుకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడమే టార్గెట్గా ప్రధాని మోడీ పని చేస్తున్నారన్నారు.