
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు సంతాప సభలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం నటుడు ప్రభాస్ తో పాటు కుటుంబసభ్యులను కలిసి పరామర్శించనున్నారు. మరోవైపు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా సెప్టెంబర్ 16వ తేదీ శుక్రవారం సాయంత్రం కృష్ణంరాజు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. హీరో ప్రభాస్ తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కానున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల మునుగోడు సభకు హాజరైన అమిత్ షా... జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.
కృష్ణంరాజు సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా కొనసాగారు. బీజేపీ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆ పార్టీకి సంబంధించిన నేతలతో మంచి సంబంధాలున్నాయి. 66 ఏళ్లకు పైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రారాజుగా వెలిగారు. సెప్టెంబర్ 11వ తేదీన అనారోగ్య కారణాలతో ఆయన కన్నుమూశారు. ఆయన మృతితో సినీలోకం దిగ్భ్రాంతికి గురైంది. కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు.