సెక్రటేరియట్ కి రాని ఏకైక సీఎం కేసీఆర్

సెక్రటేరియట్ కి రాని ఏకైక సీఎం కేసీఆర్

హైదరాబాద్: సెక్రటేరియట్ కి రాని ఏకైక సీఎం కేసీఆర్ అని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆరోపించారు. ఫామ్ హౌజ్ నుంచే కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ఆమె విమర్శించారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో కేంద్రమంత్రి శోభా కరంద్లాజే పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి మాత్రమే మేలు జరిగిందని ఆరోపించారు. రాష్ట్ర సాధన పోరాటంలో ముందుండి నడిచిన విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులకు కేసీఆర్ పాలనలో తీవ్ర నిరాశే మిగిలిందని చెప్పారు. ఇందుకేనా రాష్ట్రాన్ని సాధించుకుంది అని ప్రశ్నించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి నిధులు కేటాయిస్తోందని, అయితే సీఎం కేసీఆర్ ఆ నిధులను సక్రమంగా వినియోగించడం లేదన్నారు.

కర్ణాటకలో పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు ఇండ్లు కట్టించామని, కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ కేంద్రం నుంచి వచ్చే ఇండ్లను కూడా కట్టడం లేదని ఆరోపించారు. అర్హులకు పెన్షన్లు, ఇండ్లు ఇవ్వడం లేదని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పథకాలకు కేసీఆర్ తన పేరు పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. బండి సంజయ్ సారథ్యంలో రాష్ట్రంలో బీజేపీ దూసుకుపోతోందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే పిలుపునిచ్చారు.