పాతబస్తీలో ఎంఐఎం ఆఫీస్ కు గుర్తుతెలియని ఓ యువకుడు నిప్పంటించి పరారయ్యాడు. ఈ ఘటన చంద్రాయనగుట్టలో డిసెంబర్ 5వ తేదీ మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. చంద్రాయనగుట్ట న్యూ ఇందిరా నగర్ లో ఉన్న ఎంఐఎం కార్యాలయం వద్దకు పెట్రోల్ బాటిల్ తో వచ్చిన ఓ యువకుడు.. కార్యాలయం తలుపులకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఎగిసిపడుతున్న మంటలను గమనించిన చుట్టుప్రక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని అదుపు చేశారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకుని.. స్థానికంగా ఉన్న సీసీటీవి ఫుటేజీని పరిశీలించగా.. ఓ యువకుడు మాస్క్ ధరించి ఎంఐఎం పార్టీ కార్యాలయానికి నిప్పు అంటించిన విజువల్స్ కనిపించాయి. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.