హాస్పిటల్లో ప్రాణాలతో పోరాటం
ఆమె ప్రయాణిస్తున్న
కారును ఢీకొట్టిన ట్రక్కు
రాయ్బరేలి జైలులోని బాబాయిని చూసి
వస్తుండగా ఘటన
ప్రమాదంలో ఆమె పిన్ని,
మరో బంధువు మృతి
లాయర్ మహేంద్ర సింగ్
పరిస్థితి విషమం
ట్రక్కు నంబర్కు నల్ల రంగు వేసి ఉండడంపై అనుమానాలు
లక్నో: ఉన్నావ్ రేప్ బాధితురాలు ఘోర రోడ్డు ప్రమాదంలో చావుబతుకులతో పోరాడుతోంది. ఆదివారం ఆమె వెళుతున్న కారును ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలికి 15 కిలోమీటర్ల దూరంలో ట్రక్కు ఢీకొట్టింది. రాయ్బరేలి జైలులో ఉన్న బాధితురాలి బాబాయి మహేశ్ సింగ్ను చూసి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఆమె బంధువులు ఇద్దరు మరణించారు. చనిపోయిన వారిని ఆమె పిన్ని పుష్ప, మరో బంధువు షీలాగా గుర్తించారు. షీలా ఘటనా స్థలంలోనే చనిపోగా, పుష్ప ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఆమె లాయర్ మహేంద్ర సింగ్ తలకు తీవ్రగాయాలవడంతో ప్రాణాలతో పోరాడుతున్నాడు.
ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను లక్నోలోని కేజీఎంయూ (కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ) ట్రామా సెంటర్కు తరలించారు. రేప్ బాధితురాలికి, మహేంద్ర సింగ్కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు ఓనర్ దేవేంద్ర సింగ్, డ్రైవర్ ఆశిష్ పటేల్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని ఫోరెన్సిక్ సైన్స్ నిపుణులు పరిశీలించారు. ఉన్నావ్ రేప్ కేసు సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. 2017లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్, తనను కిడ్నాప్ చేసి రేప్ చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఆ టైంలో ఆ ఘటన పెద్ద దుమారాన్నే రేపింది. పోలీసులు కేసు నమోదు చేయడంతో బాధితురాలి తండ్రిపై సెంగార్ అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో ఆమె తండ్రి మరణించాడు. ఇప్పుడిలా రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చావుబతుకులతో పోరాడుతోంది.
ఇది యాక్సిడెంట్ కాదని, పక్కా ప్లాన్ ప్రకారమే కావాలని ట్రక్కుతో ఢీకొట్టించారని ఆమె తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. కేసును వెనక్కు తీసుకునేలా చేసేందుకే ఇలా చేశారంటున్నారు. రాయ్బరేలి జైలుకు వెళుతున్నామన్న సంగతి గ్రామంలోని ప్రతి ఒక్కరికి తెలుసని చెప్పారు. ట్రక్కు నంబర్ కనిపించకుండా ప్లేట్కు నల్లరంగు వేయడం మరిన్ని అనుమానాలుకు తావిస్తోంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
