45 రోజులుగా వడ్ల పైసలు పడ్తలే​..తిప్పలు పడుతున్న రైతులు

 45 రోజులుగా   వడ్ల పైసలు పడ్తలే​..తిప్పలు పడుతున్న రైతులు
మహబూబ్​నగర్, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో సెంటర్ల నిర్వాహకులు, రైస్​ మిల్లర్లు ఇబ్బంది పెట్టగా, తీరా కాంటాలై 45 రోజులు గడుస్తున్నా వడ్ల పైసలు జమ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలు, కొనుగోలు సెంటర్లు ప్రారంభం కాక ఇబ్బంది పడ్డ రైతుల నుంచి తాలు పేరుతో క్వింటాల్​కు 5 నుంచి 6 కిలోల వరకు తరుగు తీశారు. కనీసం డబ్బులు త్వరగా వస్తాయని అనుకుంటుండగా, వడ్లు అమ్మి నెలన్నర దాటినా 90 శాతం మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు.

పేమెంట్లు పెండింగ్

ఏప్రిల్​ 15 నుంచి మహబూబ్​నగర్​ జిల్లాలో 190 ప్రభుత్వ కొనుగోలు సెంటర్ల ద్వారా రైతుల నుంచి వడ్లను సేకరిస్తున్నారు. సివిల్​ సప్లై ఆఫీసర్లు ఇచ్చిన వివరాల మేరకు సోమవారం నాటికి 14,543 మంది రైతుల నుంచి 76,931 మెట్రిక్​ టన్నుల వడ్లు కొన్నారు. ఇందుకు గాను రైతులకు 158.44 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో 2,510 మంది రైతులకు చెందిన 14,223 మెట్రిక్​ టన్నుల వడ్లకు ఓపీఎంఎస్​ చేసి రూ.29.30 కోట్ల పేమెంట్లు చేశారు. ఇంకా 12,033 మందికి చెందిన 62,708 మెట్రిక్​ టన్నులకు సంబంధించి రూ.128.07 కోట్లు చెల్లించాల్సి ఉంది. 

ఈ లెక్కల ప్రకారం 38 శాతం పేమెంట్లు చేశామని ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకు 20 శాతం మంది రైతులకే పేమెంట్లు జరిగాయి. అవి కూడా సెంటర్లు తెరిచిన మొదట్లో వడ్లను అమ్మిన రైతులకు మాత్రమే వారి అకౌంట్లలో డబ్బులు చేశారు. ఆ తర్వాత నుంచి వడ్లను అమ్మిన రైతులకు ఇప్పటి వరకు పైసలు  జమ చేయలేదు. దీంతో వానాకాలం పంటల సాగుకు పెట్టుబడి, తెచ్చిన అప్పులు తీర్చేందుకు, ఇతరత్రా అవసరాలకు ఇబ్బంది పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే వడ్ల పైసలు ఇవ్వాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. 

పైసలు పడలే..

ప్రభుత్వం మద్దతు ధర రూ.2,060 ఇస్తామని చెప్పినా, మిల్లర్లు ఒప్పుకోలేదు. నా వడ్లు నాణ్యంగా ఉన్నా.. ఏ- గ్రేడ్​ నుంచి బి -గ్రేడ్​కు ఒప్పుకున్నా. 25 రోజుల కింద 202 క్వింటాళ్ల వడ్లను ప్రభుత్వ సెంటర్​లో అమ్మిన. ఇంత వరకు నా అకౌంట్లో పైసలు వేస్తలేరు. ఇప్పుడు పంటలు వేయడానికి పెట్టుబడుల కోసం ఇబ్బందిగా ఉంది.

- కొత్తకాపు యాదేశ్​రెడ్డి, అప్పంపల్లి, కౌకుంట్ల మండలం

అమ్మి నెల అయ్యింది

నెల కింద షేక్​పల్లిలోని ఐకేపీ సెంటర్​లో వడ్లు అమ్మిన. ఇప్పటి వరకు పైసలు రాలేదు. వానాకాలం పంటలకు టైం అయ్యింది. పైసలు రాక తిప్పలు పడుతున్నం.

- కావటి నరసింహులు, చిన్నయపల్లి, మహమ్మదాబాద్​ మండలం

24423 రకం వడ్లతో ఇష్యూ వస్తోంది

జేజీఎల్​24423 రకం వడ్లతో ఇష్యూ వస్తోంది. ఈ విషయంపై కమిషనర్​ ఆఫీస్​కు లెటర్​ రాసినం. టెక్నికల్​ టీమ్​ను పంపి ఎంక్వైరీ చేయమని చెప్పాం. పెండింగ్​లో ఉన్న పేమెంట్లు రెండు, మూడు రోజుల్లో క్లియర్​ చేస్తాం.

- ప్రవీణ్, డీఎం, సివిల్​సప్లై