పవర్ అంటే ఇదీ : నేరుగా.. రైల్వే ఫ్లాట్ పాంపైకి వచ్చిన మంత్రి కారు..

పవర్ అంటే ఇదీ : నేరుగా.. రైల్వే ఫ్లాట్ పాంపైకి వచ్చిన మంత్రి కారు..

ఉత్తరప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి ధరంపాల్ సింగ్ సైనీ రైలును అందుకునేందుకు తన వీవీఐపీ కారును ప్లాట్‌ఫాం లోపలికి తీసుకెళ్లారు. లక్నో రైల్వే స్టేషన్‌లోకి మంత్రి కారును తీసుకెళ్లడంతో ప్లాట్‌ఫారమ్‌పై గందరగోళం నెలకొంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి తన వీవీఐపీ కారును రైల్వే స్టేషన్‌లోకి తీసుకెళ్లడంపై సోషల్ మీడియాలో జనం దుమ్మెత్తి పోస్తున్నారు. మంత్రి తన కారును ప్లాట్‌ఫారమ్‌పై నిలిపి, కారు దిగిన తర్వాత ఎస్కలేటర్‌పై వెళ్లారు. పశుసంవర్థక శాఖ మంత్రి ధర్మపాల్ సింగ్ హౌరా అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుకోవాల్సి ఉంది. రైలు చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 4 వద్దకు వచ్చింది. మంత్రి రైలును అందుకోవడానికి ఆలస్యం అవుతుందని, అందుకే అతని కారును రైల్వే కోర్టు ముందు ఉన్న వికలాంగుల ర్యాంప్‌పైకి తీసుకెళ్లి, ఎస్కలేటర్ ద్వారా నేరుగా ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకెళ్లారని ఘటనా స్థలంలో ఉన్న GRP అధికారులు తెలిపారు,

ఉత్తరప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి ధర్మపాల్ సింగ్ వార్తల్లో ఉండడం ఆయనకు కొత్తేం కాదు. గతంలో, అతను రాష్ట్రంలో ఎద్దులపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఎద్దు సగటు జీవితకాలం 15 నుంచి 20 ఏళ్లు ఉంటుందని, గత ఏడేళ్లుగా తమ ప్రభుత్వం అధికారంలో ఉందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వాల పాపాలను కడిగేస్తున్నామన్న ఆయన.. రాష్ట్రంలో విచ్చలవిడి ఎద్దుల బెడదపై ధర్మపాల్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలతోపాటు రాష్ట్ర ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బరేలీలో విచ్చలవిడి పశువుల పాలీ క్లినిక్‌ను ప్రారంభించేందుకు వెళుతుండగా మంత్రి కాన్వాయ్‌ను రైతులు అడ్డుకున్నారు.