దారుణం.. 19ఏళ్ల బాలికను బంధించి.. 20రోజుల పాటు 5గురు అత్యాచారం

దారుణం.. 19ఏళ్ల బాలికను బంధించి.. 20రోజుల పాటు 5గురు అత్యాచారం

ఉత్తర్ ప్రదేశ్ లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఐదుగురు వ్యక్తులు 20 రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ నేరంలో ఇద్దరు మహిళలు కూడా పాల్గొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంభాల్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో మొత్తం ఏడుగురిపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్‌హెచ్‌ఓ అనూప్ శర్మ తెలిపారు.

సెప్టెంబర్ 27న బాలికను మొహమ్మద్ అర్షద్, అసిమ్ కిడ్నాప్ చేశారు. ఇద్దరూ ఆమెకు మత్తుమందు ఇచ్చి, మొరాదాబాద్ జిల్లాలోని తమ స్నేహితుడు ఆషిక్ ఖాన్ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత, సోనీ హుస్సేన్, ఫైజ్ ఆలం కూడా వారితో చేరారు, ఆమెపై అనేకసార్లు దాడి చేశారు. అయితే
నిందితులతో పాటు సైరా బేగం, జెబా ఖాన్ అనే ఇద్దరు మహిళలు సపోర్ట్ గా ఉన్నారని బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపింది. అక్టోబరు 12న ఆ ఇంటి నుంచి తప్పించుకుని తన ఇంటికి తిరిగి వచ్చానని ఆమె చెప్పింది. ఆమె పరిస్థితి బాగా లేకపోవడంతో సోదరుడు ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆమె డిశ్చార్జ్ అయిన తర్వాత, పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకుంది.

"ఏడుగురిపై ఒక బాలిక అపహరణ, సామూహిక అత్యాచారం ఆరోపణలు చేసింది. ప్రాథమిక విచారణ తర్వాత, మేం సంబంధిత సెక్షన్ల కింద నిందితులందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. సీఆర్పీసీ సెక్షన్ 161 కింద ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశాం. నిందితులను అరెస్టు చేయడానికి అనేక బృందాలను నియమించారు" అని సర్కిల్ ఆఫీసర్ (CO) జితేంద్ర కుమార్ తెలిపారు.

ఈ ఏడుగురిపై 376D(సామూహిక అత్యాచారం), 366 (పెళ్లి చేసుకోమని బలవంతంగా ఒక మహిళను కిడ్నాప్ చేయడం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 328 (విషం ద్వారా గాయపరచడం), 344 (రోజుల తరబడి నిర్బంధించడం), 506 (నేరపూరిత బెదిరింపు) సెక్షన్ ల కింద కేసు నమోదైంది.