ఉప్పల్, వెలుగు: ఉప్పల్ కాంగ్రెస్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటనలో ఇరు వర్గాల నాయకులు దాడులకు దిగారు. శనివారం రేవంత్ పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ ఉప్పల్లో రాగిడి లక్ష్మారెడ్డి వర్గీయులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను.. పరమేశ్వర్ రెడ్డి వర్గీయులు చించివేశారు. ఆ తర్వాత రాగిడి లక్ష్మారెడ్డి అనుచరులు అక్కడికి చేరుకుని తిరిగి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా, పరమేశ్వర్ రెడ్డి అనుచరులు రాగిడి వర్గీయులపై దాడులకు దిగారు.
దీంతో ఉప్పల్ కమాన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అంతేకాకుండా రాగిడి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేస్తుండగా వీడియో తీస్తున్న జర్నలిస్టులపై పరమేశ్వర్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఆ వీడియో ఫుటేజ్ను డిలీట్ చేయాలంటూ కెమెరాలు లాక్కునేందుకే ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీసిన వీడియో జర్నలిస్టుల వెంటపడి దాడి చేశారు. అడ్డు వచ్చిన పోలీసులను సైతం పక్కకు తోసేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జర్నలిస్టులు రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ను బాయ్కాట్ చేశారు.