
సివిల్స్ లో మహిళల సత్తా
అమ్మాయిలకే తొలి 4 ర్యాంకులు
నారాయణపేట ఎస్పీ కుమార్తెకు థర్డ్ ర్యాంక్
933 మందిని ఎంపిక చేసిన యూపీఎస్సీ
ఏపీ తెలంగాణ నుంచి పలువురి ఎంపిక
ఢిల్లీ : సివిల్స్ - 2022 తుది ఫలితాలు యూపీఎస్సీ ఇవాళ వెల్లడించింది. తొలి నాలుగు ర్యాంకులను మహిళలే కైవసం చేసుకున్నారు. మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఎంపికైన వారిలో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్ఎస్కు 38, ఐపీఎస్కు 200 మంది చొప్పున ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ - ఎ కేటగిరీలో 473 మంది, గ్రూప్ బి సర్వీసెస్లో 131 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ తెలిపింది. నారాయణపేట ఎస్పీ కుమార్తె ఎన్. వెంకటేశ్వర్లు కుమార్తె ఉమా హారతి ఎన్ మూడో ర్యాంకు సాధించడం విశేషం.
టాప్ 4 ర్యాంకుల్లో మహిళలే
ఇవాళ విడుదలైన సివిల్స్–2022 ఫలితాల్లో మొదటి నాలుగు ర్యాంకులను మహిళలే కైవసం చేసుకున్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా టాప్ ర్యాంకర్లుగా అమ్మాయిలే సత్తా చాటారు. ఇషితా కిశోర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించగా.. గరిమ లోహియా, ఉమా హారతి ఎన్. స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులతో మెరిశారు.
ఏపీ, తెలంగాణ నుంచి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పలువురు సివిల్స్లో సత్తా చాటారు. తెలంగాణలోని నారాయణపేట ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు కూతరు ఉమా హారతి ఎన్ మూడో ర్యాంకు సాధించారు. ఏపీలోని తిరుపతికి చెందిన జీవీఎస్ పవన్ దత్తా 22 ర్యాంకుతో మెరవగా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన శాఖమూరి శ్రీసాయి హర్షిత్ 40, ఆవుల సాయికృష్ణ 94, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంత్ కుమార్ 157, కమతం మహేశ్కుమార్ 200, రావుల జయసింహారెడ్డి 217, బొల్లం ఉమామహేశ్వర్రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్రెడ్డి 292, గ్రంథె సాయికృష్ణ 293, వీరగంధం లక్ష్మి సుజిత 311, ఎన్ చేతనా రెడ్డి 346, శృతి యారగట్టి ఎస్ 362, యప్పలపల్లి సుష్మిత 384, సీహెచ్ శ్రావణ్కుమార్ రెడ్డి 426, బొల్లిపల్లి వినూత్న 462 ర్యాంకులతో సత్తా చాటారు.
టాప్ 10 ర్యాంకర్లు (పేజీ1లో బాక్స్)
1. ఇషిత కిషోర్
2. గరిమ లోహియా
3. ఉమా హారతి ఎన్
4.స్మృతి మిశ్రా
5. మయూర్ హజారికా
6. గహనా నవ్య జేమ్స్
7.వసీం ఆహ్మద్ భట్
8. అనిరుధ్ యాదవ్
9. కొనిక గోయల్
10. రాహుల్ శ్రీ వాస్తవ