
- ఇండియాలో అమెరికా అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని వారణాసి టెంపుల్ తన మనసును తాకిందని ఇండియాలో అమెరికా అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి అన్నారు. వారణాసి ఘాట్ల నుంచి సూర్యోదయాన్ని, గంగా హారతిని చూడటం గొప్ప అనుభూతి అని పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం ‘ఎక్స్’లో వరుస ట్వీట్లు చేశారు. ‘‘అస్సి ఘాట్లో గంగానది మీదుగా సూర్యోదయాన్ని చూడటం కలలాగా అనిపించింది.
తెల్లవారుజామున ఇతర భక్తులతో కలిసి సూర్యోదయాన్ని చూడటం ఆనందం ఇచ్చింది. అలాగే, దశాశ్వమేధ ఘాట్లో గంగా హారతి కార్యక్రమం ఒక వేడుక మాత్రమే కాదు.. సంప్రదాయం మనల్ని ఎలా తీర్చిదిద్దుతోందో చెప్పడానికి ఒక ఒక రిమైండర్ లాంటిది. నదిపై ప్రతిబింబించే దీపాలు, రాత్రి సమయంలో ప్రతిధ్వనించే గంటల శబ్దం మరపురాని వాతావరణాన్ని సృష్టిస్తాయి. వారణాసి.. నా మనసును టచ్ చేసింది” అని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అంతకుముందు ఆయన ‘‘నమస్తే వారణాసి! ఎట్టకేలకు కాశీ సందర్శించడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది’’ అంటూ మరో ట్వీట్ చేశారు.