
- ఆ దేశానిది ఫేక్ ప్రచారమన్న అమెరికా
వాషింగ్టన్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ను తమ దేశ మిలిటరీ పరేడ్ కు ఆహ్వానించలేదని అమెరికా స్పష్టం చేసింది. ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. తమ దేశ సాయుధ బలగాల 250వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న మిలిటరీ పరేడ్ కు ఏ విదేశీ మిలిటరీ లీడర్లను కూడా ఆహ్వానించలేదని పేర్కొంది. ఈ మేరకు వైట్ హౌస్ అధికారులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికా మిలిటరీ పరేడ్కు ఆసిమ్ మునీర్ ను ఆహ్వానించినట్లు అంతకుముందు వార్తలు రావడంతో వైట్హౌస్ ఈ మేరకు స్పందించింది.
ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడింది. ‘‘పహల్గాం టెర్రర్ అటాక్లో హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను అమెరికా మిలిటరీ పరేడ్ కు ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. వ్యూహాత్మకంగానూ, దౌత్యపరంగానూ ఇది మన దేశానికి పెద్ద ఎదురుదెబ్బ” అని కాంగ్రెస్ లీడర్ జైరాం రమేశ్ ‘ఎక్స్’లో విమర్శించారు.
జైరాం విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీపై అక్కసుతోనే జైరాం రమేశ్ ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తున్నారని, ప్రధానిపై విమర్శలు చేసే ఆతురతతో ఆయన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ‘ఎక్స్’లో మండిపడ్డారు. కాగా.. 1775 జూన్ 14న అమెరికా ఆర్మీని స్థాపించారు. ఆర్మీ 250 ఏండ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో మిలిటరీ పరేడ్ను అమెరికా నిర్వహిస్తున్నది.