US Visa: అమెరికా వీసాకు కొత్త రూల్స్.. ఇండియాలోని యూఎస్ ఎంబసీ హెచ్చరిక

US Visa: అమెరికా వీసాకు కొత్త రూల్స్.. ఇండియాలోని యూఎస్ ఎంబసీ హెచ్చరిక

Visa News: చాలా మందికి చిన్నప్పటి నుంచే ఈ రోజుల్లో పెద్దయ్యాక విదేశాల్లో చదువుకోవాలి, అక్కడ స్థిరపడాలి అంటూ ఇంట్లో వాళ్లు చెబుతూనే ఉన్నారు. దీనికి తోడు మధ్యతరగతి భారతీయ కుటుంబాలు వారి పిల్లలను విదేశాల్లో చదివించి మంచి జీవితం అందించాలని కూడా ఆశపడుతున్నారు. దీంతో మెుత్తానికి అమెరికా వెళ్లేవారి సంఖ్య ఏటకు ఏటా పెరుగుతోంది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది యువత ఉన్నారు. అయితే తాజాగా ఇండియాలోని యూఎస్ ఎంబసీ వీసా ఔత్సాహికులకు కీలక ప్రకటన చేసింది. 

ALSO READ | AI News: మెటా సంచలనం.. ఏఐ నిపుణులకు మార్క్ మామ రూ.860 కోట్ల శాలరీ ఆఫర్..

ఇకపై అమెరికా వీసాల కోసం ప్రయత్నించే ఔత్సాహిక భారతీయులు తాము గడచిన ఐదేళ్లుగా ఉపయోగించిన అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్, వాటి యూజర్ నేమ్ వివరాలను DS-160 వీసా అప్లికేషన్లలో పొందుపరచాలని యూఎస్ ఎంబసీ వెల్లడించింది. వ్యక్తుల బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ కోసం ఈ వివరాలు తప్పనిసరిగా మారినందున ప్రతి ఒక్కరూ పూర్తి సమాచారాన్ని తమతో పంచుకోవాల్సిందేనని ఎంబసీ తాజా ఎక్స్ పోస్టులో వెల్లడించింది. 

 

సరైన సమాచారం అందించకపోవటం లేదా తప్పుడు సమాచారం ఇవ్వటం వంటి చర్యలతో వీసా అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుందని ఎంబసీ స్పష్టం చేసింది. పైగా భవిష్యత్తులో యూఎస్ వీసా కోసం చేసే ప్రయత్నాలను పూర్తిగా నిరోధించబడతాయని పేర్కొంది. వాస్తవానికి అమెరికాలో రోజురోజుకూ పెరుగుతున్న ఘర్షణలను, యూనివర్సిటీల్లో విద్యార్థుల ఆందోళనలను అరికట్టేందుకు ప్రెసిడెంట్ ట్రంప్ సర్కార్ తీసుకున్న చర్యలకు అనుగుణంగా ప్రస్తుత మార్పులు వచ్చాయి. అమెరికా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. 

దీనికి ముందు ఈ వారం ప్రారంభంలో F, M, J కేటగిరీల కింద స్టూడెంట్ వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ నుంచి పబ్లిక్ చేయాలని రాయబార కార్యాలయం ఆదేశించింది. అమెరికా చట్టం ప్రకారం వారి గుర్తింపు, యునైటెడ్ స్టేట్స్‌కు ప్రవేశాన్ని నిర్ధారించడానికి అవసరమైన పరిశీలనను సులభతరం చేసేందుకు ఈ మార్పులను తీసుకొచ్చినట్లు వెల్లడైంది.