
Mark Zuckerberg: ప్రస్తుతం ప్రపంచం మెుత్తం టెక్నాలజీ మయంగా మారిపోయింది. దీనికి తోడు ఇటీవలి కాలంలో ఏఐ వినియోగం అన్నింటా ఇమిడిపోవటంతో టెక్ కంపెనీల మధ్య పోరు రోజురోజుకు తారా స్థాయిలకు చేరుకుంటోంది. ఈ క్రమంలో అమెరికాలోని టెక్ దిగ్గజం మెటా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టాలెంట్ కోసం కోట్ల రూపాయల ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది.
ఈ క్రమంలో మెటా సీఈవో మార్క్ జూకర్బర్గ్ స్వయంగా టాప్ ఏఐ నిపుణుల రిక్రూట్మెంట్ విషయంలో అగ్రసివ్ గా ముందుకెళుతున్నారు. ఒక్కొక్కరికి 100 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.860 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీని ఆఫర్ చేస్తూ ఇతర సంస్థల్లోని నిపుణులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మెటా సంస్థ సూపర్ ఇంటెలిజెన్స్ పేరుతో అంతర్గతంగా ఒక ఏఐ అభివృద్ధి టీమ్ నిర్మిస్తోంది. ఇందులో భాగంగా జూకర్బర్గ్ స్వయంగా చాలా మంది సైన్టిస్టులను, నిపుణులను, రీసెర్చర్లను, ఇంజనీర్లను, ఎంటర్ ప్రెన్యూర్లను వ్యక్తిగతంగా కలుస్తూ తన ల్యాబ్ కోసం రిక్రూట్మెంట్లను నిర్వహించే పనిలో ఉన్నారని తేలింది.
ఈ క్రమంలో మెటా సీఈవో ఏఐ స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు, ఏఐ కంపెనీల కొనుగోలు వంటి ప్రణాళికలను కూడా కలిగి ఉన్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో మార్క్ చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐలోని ముగ్గురు ఉద్యోగులను తన సంస్థలో చేర్చుకునేందుకు భారీ ఆఫర్లు కూడా ఇచ్చినట్లు వెల్లడైంది. అయితే వారెవరూ మెటాలో చేరేందుకు సుముఖంగా లేరని మార్క్ ఆఫర్లను తిరస్కరించారని ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మాన్ వెల్లడించారు. మార్క్ పూర్తి ప్లాన్ గురించి స్పష్టంగా చెప్పకపోవటమే దీనికి కారణంగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఏఐకి సంబంధించిన రిక్రూట్మెంట్ల విషయంలో మెటా సీఈవో నేరుగా ఇన్వాల్వ్ అవుతున్నట్లు వెల్లడైంది. ఇందుకోసం కొందరిని తన వ్యక్తిగత నివాసంలో కలుస్తున్నట్లు తేలింది. అలాగే వారి రిక్రూట్మెంట్ తర్వాత వారిని ఎక్కడ ఉంచాలనే అంశాలపై కూడా ఆయనే మార్గనిర్థేశకం చేస్తున్నారట. మధ్యవర్తులు లేకుండా నేరుగా మార్క్ మెయిల్స్ పంపటంతో కొందరు వాటిని నకిలీవిగా భావించారని వెల్లడైంది. అయితే ఒప్పించిన నిపుణులకు మాత్రం తరచుగా జుకర్బర్గ్ ఆతిథ్యం ఇచ్చేవారని తేలింది.