వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియా ను పూర్తిస్థాయిలో వినియోగించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. గ్రేటర్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జీలు, ముఖ్య నేతలతో మంగళవారం సమావేశమయ్యారు. అన్ని సెగ్మెంట్ల సోషల్ మీడియా కో ఆర్డినేటర్లు జాబితాలను ఇవ్వాలని ఆదేశించారు.
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలకు సూచించారు. తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జ్లు, ముఖ్య నేతలతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. 6వ తేదీలోగా బస్తీ, డివిజన్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని, బూత్ లెవల్లో ఒక సోషల్ మీడియా కో ఆర్డినేటర్ను నియమించుకోవాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో సోషల్ మీడియా కో ఆర్డినేటర్ల జాబితాను విడిగా ఇవ్వాలని ఇన్చార్జ్లను ఆదేశించారు. బస్తీ, డివిజన్ స్థాయి కమిటీ బాధ్యులు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్లకు విడివిడిగా శిక్షణ ఇస్తామన్నారు. టీఆర్ఎస్ డిజిటల్ మీడియా సైన్యం సోషల్ మీడియా కో ఆర్డినేటర్లతో కలిసి పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
మనమే గెలవబోతున్నం
గ్రేటర్తోపాటు అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్సే గెలువబోతోందని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మేడ్చల్ లో పది మున్సిపాలిటీలున్నాయని, ఒక్కరే సమన్వయం చేయడం సాధ్యం కాదని, ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కో ఇన్చార్జ్ని నియమించాలన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల ఇన్చార్జ్లుగా సిటీ ఎమ్మెల్యేలను నియమిస్తామన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లను మున్సిపల్ ఎన్నికలకు ఇన్చార్జీగా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తారని తెలిపారు. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి పాల్గొన్నారు.