
- అగ్రివర్సిటీలో త్వరలో అధునాతన ప్రయోగశాల
- ప్రీ లాంచ్ కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు
గండిపేట, వెలుగు: వ్యవసాయ రంగంలో ప్రస్తుత సవాళ్లను అధిగమించడానికి ఏఆర్ఐఎస్ఏ (ఏఐ, రోబోటిక్స్, ఐఓటీ ఫర్ స్మార్ట్ అగ్రికల్చర్) ల్యాబ్ అత్యవసరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్రావు అభిప్రాయపడ్డారు. దేశంలోనే మొదటిసారిగా ఫ్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇలాంటి సృజనాత్మకమైన ఆలోచన చేసి, ఏఐతో కూడిన ల్యాబ్ను నెలకొల్పుతున్నందుకు వీసీ జానయ్య, ఇతర సిబ్బందిని అభినందించారు.
ఎస్బీఐ సహకారంతో వర్సిటీ ఆవరణలో అగ్రి హబ్ఏర్పాటు చేయనున్న ఏఆర్ఐఎస్ఏ ల్యాబ్ ప్రీ లాంచ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రానున్న 20 ఏండ్లలో వ్యవసాయం చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని, తద్వారా ఆహార భద్రతకు పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వీసీ జానయ్య అన్నారు. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో వ్యవసాయం సుస్థిరంగా ఉండాలంటే మానవ రహిత వ్యవసాయమే శరణ్యమన్నారు. ఇందుకోసం ఏఐతో కూడిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి రైతాంగానికి అందించినప్పుడే వ్యవసాయ రంగం సుస్థిరంగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు పాల్గొన్నారు.