కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపాలన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటికే కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వానికి రెండు లేఖలు రాసిందని.. అయినా ఏపీ ప్రభుత్వం లో మార్పు లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై స్పందించాలంటూ మంగళవారం ఓ బహిరంగ లేఖ రాశారు ఉత్తమ్.
దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ విస్తరణ, సంగమేశ్వరం నుంచి రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించే ప్రాజెక్టు లపై తెలంగాణ ప్రభుత్వమే సుప్రీం కోర్టుకు వెళ్లాలని లేఖలో పేర్కొన్నారు. సీఎం మే 11 వ తారీఖున సుప్రీంకోర్టుకు వెళుతున్నట్లుగా ప్రకటించారు కానీ ఇంతవరకు సుప్రీంకోర్టుకు వెళ్లలేదన్నారు. కృష్ణా బేసిన్ నీటిని పెన్నా బేసిన్ కు తీసుకెళ్లడం అక్రమమని అన్నారు. కేసీఆర్ ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు అడ్డుకోకపోతే ఉమ్మడి మహబూబ్ నగర్ , నల్గొండ , రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారడంతో పాటు హైదరాబాద్ కు తాగునీటి కష్టాలు వస్తాయని అన్నారు.
బుధవారం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు ముఖ్యమంత్రి హాజరు కావాలన్నారు ఉత్తమ్. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉన్న రోజు సెక్రటేరియట్ డిజైన్ల కోసం క్యాబినెట్ పెట్టుకోవడం… సీఎం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినట్లేనని అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ ద్వారా 44 వేల క్యూసెక్కుల నుంచి రోజుకు 80 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ ప్రభుత్వం అక్రమంగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. సంగమేశ్వర వద్ద నుంచి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీటిని తీసుకువెళ్లేందుకు పనులు మొదలు పెట్టబోతున్నదని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
రెండు TMC ల కోసం లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సీఎం గొప్పలు చెప్పుకుంటున్నారని… మరి రోజుకు 10 టీఎంసీల కు పైగా నీళ్లను ఏపీ ప్రభుత్వం తీసుకువెళ్లేందుకు సిద్ధమైతే ఎందుకు ఆపడం లేదన్నారు.