- పోతిరెడ్డిపల్లి వద్ద బ్యారేజీ పనులను వెంటనే ప్రారంభించండి
- ఈ నెల 15 నాటికి ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోండి
- ఏఎమ్మార్పీ ఎస్ఎల్బీసీ కెనాల్ కెపాసిటీని 4 వేల క్యూసెక్కులకు పెంచండి
- మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ప్రాజెక్ట్పై రివ్యూ
హైదరాబాద్, వెలుగు: డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆఫ్టేక్ పాయింట్ఎత్తును వెంటనే కన్ఫర్మ్ చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం సెక్రటేరియెట్లో మంత్రి ఉత్తమ్ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో కలిసి సమీక్షించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్లోని ఏదుల రిజర్వాయర్నుంచి డిండి లిఫ్ట్ అప్రోచ్ చానెల్కు నీళ్లను ఎంత ఎత్తు నుంచి తీసుకోవచ్చో ఆ లెవెల్ను వెంటనే ఫిక్స్ చేయాల్సిందిగా ఇరిగేషన్ శాఖ సెక్రటరీ శ్రీధర్, ఈఎన్సీ రమేశ్ బాబును మంత్రి ఉత్తమ్ఆదేశించారు.
పోతిరెడ్డిపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని, అందుకు సంబంధించిన ఆర్థిక అనుమతులను ఈ నెల 15 నాటికి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఏఎమ్మార్పీ ఎల్ఎల్బీసీ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2,400 క్యూసెక్కుల నుంచి 4 వేల క్యూసెక్కులకు పెంచేలా చర్యలు తీసుకోవాలని, ఆ తర్వాతే కాంక్రీట్ లైనింగ్ వర్క్స్ను చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆ తర్వాత దాని సామర్థ్యాన్ని 6 వేల క్యూసెక్కులకు పెంచుకోవచ్చన్నారు.
ఏఎమ్మార్పీ ఎస్ఎల్బీసీ కెనాల్కాంక్రీట్ లైనింగ్ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.443 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 228 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీటిని, 3.61 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు వీలవుతుందన్నారు. ప్రాజెక్టుకు నెలలో స్టేజ్ 1 ఫారెస్ట్ అనుమతులు వస్తాయని మంత్రి తెలిపారు. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు గేట్లను బిగించేందుకు టెండర్లను పిలవాలని అధికారులను ఆదేశించారు. పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రివైజ్డ్ ఎస్టిమేట్స్పైనా మంత్రి సమీక్షించారు. దీనిపై హైపవర్కమిటీతో చర్చిస్తామన్నారు. వచ్చే నెల కేబినెట్ మీటింగ్లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ పెట్టాలని సూచించారు.
కాగా, డిండి లిఫ్ట్ స్కీమ్లో భాగంగా 25.31 టీఎంసీల స్టోరేజ్ సామర్థ్యంతో నాలుగు ఆన్లైన్ రిజర్వాయర్లు, ఐదు ఆఫ్లైన్ రిజర్వాయర్లను నిర్మించనున్నారు. పోతిరెడ్డిపల్లిలో బ్యారేజ్ హెడ్వర్క్స్, 16 కిలోమీటర్ల టన్నెల్ పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు 95 శాతం వరకు పూర్తయ్యాయి. మూడు గ్రామాలు, నల్గొండ, నాగర్కర్నూల్ జిల్లాలోని దాదాపు 450 ఎకరాల అటవీ భూముల ముంపు ప్రభావంతో స్పిల్ వే పనులు నిదానంగా సాగుతున్నాయి.
