ఆర్థిక సాయం.. కార్మికులకు రూ.1లక్ష చెక్కులను అందించిన ధామి

ఆర్థిక సాయం.. కార్మికులకు రూ.1లక్ష చెక్కులను అందించిన ధామి

ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్ నుంచివిజయవంతంగా బయటికొచ్చిన  41మంది కార్మికులను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కలుసుకున్నారు. అంతే కాదు వారి క్షేమ సమాచారం తెలుసుకుని, ఆసుపత్రిలో వారికి సహాయ చెక్కులను కూడా అందజేశారు. చిన్యాలిసౌర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లోని కార్మికులతో ముఖ్యమంత్రి సమావేశమై వారికి చెక్కులను అందజేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.

నవంబర్ 28న మీడియాతో మాట్లాడిన సీఎం ధామి.. సొరంగం నుంచి రక్షించిన 41 మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఆసుపత్రి చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని కూడా చెప్పారు. రక్షించిన కార్మికులను ఇంటికి పంపించే ముందు వైద్యుల పరిశీలనలో ఉంచుతామని ముఖ్యమంత్రి చెప్పారు.  

ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ మార్గంలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో ఒక భాగం నవంబర్ 12 న కూలిపోవడంతో లోపల ఉన్న కార్మికులు అందులో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు.. శిథిలాల మధ్యలోనుంచి ఆరు అంగుళాల పైపు ద్వారా ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాలను వారికి పంపారు. 41 మంది కార్మికుల్లో 15 మంది జార్ఖండ్‌కు, ఇద్దరు ఉత్తరాఖండ్‌కు, ఐదుగురు బీహార్‌కు, ముగ్గురు పశ్చిమ బెంగాల్‌కు, 8 మంది ఉత్తరప్రదేశ్‌కు, ఐదుగురు ఒడిశాకు, ఇద్దరు అస్సాంకు, ఒకరు హిమాచల్ ప్రదేశ్‌కు చెందినవారున్నారు.