రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

కారేపల్లి, వెలుగు : రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. బుధవారం కారేపల్లి సోసైటీ కార్యాలయంలో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా సొసైటీ చైర్మన్‌ దుగ్గినేని శ్రీనివాసరావు ఆధ్యక్షతన నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు.  రసాయన ఎరువు వాడకం తగ్గించి, జీవరసాయన ఎరువులను ఉత్పత్తి చేసే జిలుగు, జనుము, పెసర లాంటి పచ్చిరొట్ట ను సాగు చేయాలన్నారు.

ఈ విత్తనాలు 50శాతం సబ్సిడీతో అందిస్తున్నట్లు చెప్పారు. రైతు పండించిన వరి ధాన్యానికి ఇస్తున్న బోనస్‌, రైతుభరోసా పెట్టుబడి పథకాన్ని మరిపిస్తోందన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో కారేపల్లి మండలంలో 289 మంది రైతులకు రూ.73.60 లక్షల వరి బోనస్‌ వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. మండలంలో 5,249 మంది రైతులకు రూ.46.19 కోట్లు రుణమాఫీ జరిగిందన్నారు. రైతు భరోసా కింద ఇప్పటి వరకు 1,500 మంది రైతులకు గాను రూ. 12.78 కోట్లు జమ అయ్యాయని తెలిపారు.

వైరాలో నిర్వహించిన ఉద్యోగ మేళ సంతృప్తినిచ్చిందన్నారు. మేళాకు 12వేల మంది హాజరుకాగా 4,050 మందికి రూ.15 వేల నుంచి రూ.60 వేల జీతభత్యాలు గల ఉద్యోగాలు ఇప్పించినట్లు వివరించారు. ఈకార్యక్రమంలో వైరా ఏడీఏ కరుణశ్రీ, ఎంపీడీవో సురేందర్‌, ఏవో అశోక్‌కుమార్‌, సొసైటీ సీఈఓ బొల్లు హనుమంతరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.