
లక్నో: వారణాసిలో జ్ఞానవాపి మసీదు ఏరియాలోని సీల్డ్ బేస్మెంట్లో హిందూ పిటిషనర్లు పూజలు చేసుకోవచ్చని సిటీ కోర్టు తీర్పు చెప్పింది. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. బారికేడ్లను తొలగించి వారం రోజుల్లో బేస్మెంట్ను రెడీ చేయాలని పేర్కొంది. కాశీ విశ్వనాథ్ ఆలయానికి చెందిన పూజారులతో పూజలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆ మసీదు బేస్మెంట్లో పూజలు చేసుకునేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందని ఈ కేసులో నలుగురు హిందూ మహిళల తరపున వాదిస్తున్న అడ్వొకేట్ విష్ణుశంకర్ జైన్ అన్నారు. కాగా, సిటీ కోర్టు తీర్పును జ్ఞానవాపి మసీదు కమిటీ హైకోర్టులో సవాలు చేయనుంది. ఈ మసీదులోని బేస్ మెంట్లో నాలుగు సెల్లార్లు ఉన్నాయి. ఒక సెల్లార్ పూజారుల ఫ్యామిలీ ఆధీనంలో ఉంది. వంశపారంపర్య పూజారులుగా అక్కడ పూజలు చేసుకునేందుకు తమకు హక్కు ఉందని ఆ కుటుంబం మొదటి నుంచి వాదిస్తోంది. 1993 వరకు పూజారి సోమనాథ్ వ్యాస్ అక్కడ పూజలు చేసేవారని తెలిపింది. కాగా, జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్లోని వజుఖానా ప్రాంతంలో శివలింగం బయటపడిందని, ఆ విషయంపై సైంటిఫిక్ సర్వే నిర్వహించాలని కోరుతూ హిందూ మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.