వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ హైడ్రామా
సొంత పార్టీ వాళ్లే అవమానిస్తున్నారని రాజీనామా
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్ బాబు ఫోన్ చేశారని వెనక్కి
వేములవాడ, వెలుగు: ‘సొంత పార్టీవారే అవమానిస్తున్నారు.. పదవిలో కొనసాగ’నంటూ మధ్యాహ్నం రాజీనామా చేసిన వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ మధురాజేందర్.. రాత్రి కల్లా తన నిర్ణయం మార్చుకున్నారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేశ్ బాబు ఫోన్ చేసి బుజ్జగించడంతో మనసు మార్చుకున్నట్లు వెల్లడించారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శుక్రవారం మధ్యాహ్నం కొనసాగిన ఈ పొలిటికల్ హైడ్రామా రాత్రికి తుస్సుమంది. కొంతకాలంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో మున్సిపాలిటీలోని అధికార పార్టీ కౌన్సిలర్లు రెండుగా విడిపోయారు. ఎమ్యెల్యే రమేశ్ బాబు దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోకపోవడంతో ఈ వివాదం ముదిరింది. కౌన్సిలర్లు గొడవ పెట్టుకోవడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కామన్గా మారింది. ఇటీవల మున్సిపల్ సమావేశంలో వైస్ చైర్మన్ స్టేజీపై కూర్చోరాదని బీజేపీ కౌన్సిలర్లు అంటే, అడ్డుకోవాల్సిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు మౌనంగా ఉండి పోయారు. దీంతో వైస్ చైర్మన్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. తర్వాత సర్దార్ వల్లభాయ్ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో పూలమాలలు వేసే క్రమంలో ప్రోటోకాల్ విషయంలో చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల మధ్య గొడవ జరిగింది. దీనితో రెండు వర్గాలుగా విడిపోయిన అధికార పార్టీ కౌన్సిలర్లే అసభ్య పదజాలంతో మధురాజేందర్ పై చేయి చేసుకున్నారు. దీంతో అప్పుడే తీవ్ర మనస్తాపం చెందారు. మళ్లీ జరిగిన మున్సిపల్ సమావేశానికి కూడా వైస్ చైర్మన్ హజరుకాలేదు. ఈ క్రమంలో వైస్ చైర్మన్ మధు రాజేందర్ తన రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి శుక్రవారం మధ్యాహ్నం అందజేశారు. తర్వాత ఎమ్యేల్యే రమేశ్ బాబు, కేటీఆర్ తనను బుజ్జగించారని, పార్టీలో తన అవసరం ఎంతో ఉందని చెప్పడంతో రాత్రి రాజీనామా ఉపసంహకరించుకున్నానని మధు రాజేందర్ ప్రకటించారు.
For More News..