వెంకటేష్ హీరోగా నటించిన 75వ సినిమా ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా వెంకటేష్ చెప్పిన విశేషాలు. ఇదొక బ్యూటిఫుల్ డాటర్ సెంటిమెంట్ మూవీ. దర్శకుడు శైలేష్ కొలను మంచి కథను రాశాడు. రెగ్యులర్గా కాకుండా కథకు అవసరమయ్యే ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. చాలా ఫాస్ట్ పేస్డ్గా సాగుతుంది. నాకొక డిఫరెంట్ బ్యాక్డ్రాప్ మూవీ అవుతుందనిపించింది. స్టోరీ నడిచే విధానం చాలా కొత్తగా ఉంటుంది.
క్లైమాక్స్ని ఎక్స్ ట్రార్డినరీగా డిజైన్ చేశాడు. హైలీ ఎమోషనల్గా ఉంటుంది. ఇందులో బేబీ సారా నటన అద్భుతంగా చేసింది. తనలో స్పార్క్ ఉంది. పిల్లలతో కలసి పని చేయడం నాకు చాలా ఇష్టం. నవాజుద్దీన్ సిద్దికీ గ్రేట్ యాక్టర్. ఇందులో క్రేజీ రోల్ చేశారు. ఆయన పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. శ్రద్ధా శ్రీనాథ్, ఆర్య, ఆండ్రియా కీలక పాత్రలు పోషించారు. ‘సైంధవ్’ వరల్డ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సంతోష్ నారాయణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎక్స్లెంట్గా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన రాంగ్ యూసేజ్, సరదాలే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నా.
ఇది నా 75వ సినిమా. 75 అనేది నెంబర్ మాత్రమే. కెరీర్ లో 50, 75, 100 నెంబర్స్ సహజంగానే ఒక మైల్ స్టోన్లా అనుకుంటారు. నా వరకూ .. ఆ సమయానికి వచ్చింది నిజాయితీగా చేయాలని ప్రయత్నిస్తాను. నా దృష్టిలో ప్రతి సినిమా ప్రత్యేకమే. ప్రతి సినిమాకి కష్టపడి పని చేయాలి. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. ప్రస్తుతం రెండు, మూడు కథలు విన్నా. ఇంకా ఏదీ ఫైనల్ చేయలేదు. అందరి హీరోలతోనూ పనిచేయాలని ఉంటుంది. నానితో చేసే చాన్స్ వస్తే కచ్చితంగా చేస్తాను. సంక్రాంతికి వచ్చే నాలుగు సినిమాలు బాగా ఆడి ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నా’’.