త్వరలో శామీర్ పేటలో ‘పిస్తా హౌస్’ ఫ్లైట్ రెస్టారెంట్ !!

త్వరలో శామీర్ పేటలో ‘పిస్తా హౌస్’ ఫ్లైట్ రెస్టారెంట్ !!

ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త థీమ్ లతో రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. ఇదే కోవలో నడుస్తూ హైదరాబాద్ లోని ప్రఖ్యాత ‘పిస్తా హౌస్’ ఏకంగా విమానంలో రెస్టారెంట్ ను స్టార్ట్ చేయబోతోంది.  ఎయిర్ బస్ కంపెనీకి చెందిన ఏ320 రకం పాత విమానాన్ని కేరళలో నిర్వహించిన వేలంలో రూ.75 లక్షలకు  పిస్తా హౌస్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తరలింపు ఖర్చులనూ కలుపుకుంటే.. అది హైదరాబాద్ కు చేరే సరికి మొత్తం కోటి రూపాయల వ్యయం అవుతోందని అంటున్నారు. ఈ విమానాన్నే త్వరలో హైదరాబాద్ శివార్లలోని శామీర్ పేటలో రెస్టారెంట్ గా ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం విమానం లోపల కొన్ని డిజైనింగ్ పరమైన మార్పులు చేయనున్నారు.

2023 జనవరిలో ఈ ఫ్లైట్ రెస్టారెంట్ ను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ విమానంలో కూర్చొని.. శామీర్ పేట చెరువు అందాలను చూస్తూ, బిర్యానీ రుచులను ఆస్వాదించేలా పిస్తా హౌస్ నిర్వాహకులు ఇంటీరియర్ డిజైనింగ్ చేయించనున్నారు. ఇందులో భాగంగా విమానం లోపల అధునాతన సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. విమానంలోకి ప్రవేశించేందుకు ఎస్కలేటర్ ను నిర్మించనున్నారు. విమానం ఆగిన ప్రదేశాన్ని రన్ వే తరహాలో తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు.