
టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు(83) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జులై 13న తెల్లవారుజామున 4 గంటలకు ఆయన ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
నాలుగు దశాబ్దాల తన సినీ కెరీర్ లో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన ఆయన 750కి పైగా సినిమాల్లో నటించారు. కోట శ్రీనివాస్ రావు మృతితో టాలీవుడ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జులై 10న జన్మించిన కోట శ్రీనివాస రావుకు ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు(రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు కుమారుడు). తెలుగు,తమిళ,కన్నడ,హిందీ.మలయాళ భాషల్లో నటించారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆహ నా పెళ్లంట సినిమాతో తిరుగులేని నటుడిగా కొనసాగారు. ప్రతి ఘటన సినిమాతో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు. 1999 లో విజయవాడ ఈస్ట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాస రావు స్టేట్ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేశాడు.కోట శ్రీనివాస రావుకు 9 నంది అవార్డులు వచ్చాయి. 2015లో పద్మశ్రీ అందుకున్నారు.