హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న గోవుల అక్రమ రవాణా, పశువుల అక్రమ నిల్వలపై వీహెచ్పీ తెలంగాణ బృందం ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం లోక్ భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను వీహెచ్పీ ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.
రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై గవర్నర్కు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. బక్రీద్ను పురస్కరించుకుని బలి ఇవ్వడానికి వేలాది ఆవులు, పశువులను ఇప్పటికే డంప్ చేసి ఉంచారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అక్రమంగా తరలిస్తున్న పశువులను విడిపించి, గోశాలలకు తరలించడంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని వీహెచ్పీ నేతలు ఆరోపించారు.
సాగుకు ఉపయోగపడే పశువులు, మూడేండ్లలోపు లేగదూడలను వధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్న తమ కార్యకర్తలపై పోలీసులు అక్రమ బైండోవర్ కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. పోలీసు శాఖ మజ్లీస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తాము లేవనెత్తిన అంశాలపై గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సానుకూలంగా స్పందించినట్టు ప్రతినిధుల బృందం పేర్కొంది.
