- సభా వేదిక వరకు తీసుకెళ్లిన ప్రధాని
- సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామన్న ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: రాజ్యసభ కొత్త చైర్మన్గా ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశల తొలిరోజు.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఇతర నేతలు ధన్కర్ను చైర్మన్ సీటు వరకు తీసుకుని వెళ్లారు. పలు పార్టీలకు చెందిన ఎంపీలు ఈ సందర్భంగా ధన్కర్కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను ధన్కర్ కొనసాగిస్తారని అధికార పార్టీ సభ్యులు ఆశాభావం వ్యక్తంచేశారు. చిన్న పార్టీలకు మరింత సమయం ఇవ్వాలని, ప్రభుత్వ బిల్లుల స్క్రూటినీ కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను బలోపేతం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్సభ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఇటీవల మరణించిన సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్, 8 మంది మాజీ సభ్యులకు లోక్సభ నివాళులర్పించింది. ద మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్(అమెండ్మెంట్) బిల్లు, 2022ను ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది.
లీగల్ అంశాలపై ధన్కర్కు పట్టుంది: మోడీ
ధన్కర్కు స్వాగతం పలుకుతూ ప్రధాని మోడీ ఉపన్యాసం చేశారు. రాజ్యసభ చైర్మన్గా ధన్కర్ ప్రజాస్వామ్య విలువలను కాపాడతారని విశ్వాసం వ్యక్తంచేశారు. ఆయన ఒక రైతు కొడుకని, సైనిక స్కూల్లో చదువుకున్నారని చెప్పారు. ధన్కర్కు లీగల్ అంశాలపై ఎంతో పట్టుఉందన్నారు. ఎంతో మందికి ఆయన స్ఫూర్తి అని కొనియాడారు. సభ సజావుగా సాగేందుకు అండగా ఉంటామని ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే హామీ ఇచ్చారు.
లక్ష్మణ రేఖను గౌరవించాలి: ధన్కర్
రాజ్యసభ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన జగదీప్ ధన్కర్ తొలిసారి సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రభుత్వంలోని 3 వ్యవస్థలు ఒకదాని విషయంలో మరొకటి జోక్యం చేసుకుంటే పాలన దెబ్బతింటుందని, అందువల్ల అందరూ ‘లక్ష్మణరేఖ’ను గౌరవించాలని అన్నారు. జడ్జీల నియామకంపై ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య ఇటీవల మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే