యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా బీబీనగర్లోని సబ్రిజిస్ట్రార్ ఆఫీసులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. బీబీనగర్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ పెద్ద ఎత్తున సాగుతూ ఉండడంతో క్రయ విక్రయాలు ఎక్కువగా కొనసాగుతూ ఉన్నాయి. అన్ని చోట్ల మాదిరిగానే ఇక్కడ కూడా డాక్యూమెంట్ రైటర్స్ ప్రభావం ఎక్కువే. కమీషన్ల పేరుతో పెద్ద ఎత్తున్న డబ్బు చేతులు మారుతుంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా విజిలెన్స్ సీఐ దశరథ ఆధ్వర్యంలో బృందం ఇక్కడికి చేరుకొని పలు రికార్డులు, డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఆస్తుల అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రికార్డుల నిర్వహణ, రూల్స్ అమలుపై తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం వరకూ తనిఖీలు కొనసాగించి, వివరాలను నమోదు చేసుకొని విజిలెన్స్ ఆఫీసర్లు వెళ్లిపోయారు. విజిలెన్స్ ఆఫీసర్ల తనిఖీలతో పరిసరాల్లో ఉన్న డాక్యుమెంట్రైటర్లు అప్రమత్తమై తమ షాపులను వెంటనే మూసివేశారు. కాగా గతేడాది ఈ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

