కేసీఆర్ తాను మహారాజు అనుకుంటున్నారా?

కేసీఆర్ తాను మహారాజు అనుకుంటున్నారా?

యాదాద్రి ఆలయ స్థూపాలు, శిల్పాలపై సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గుర్తు ఉండటం రాజకీయ దుమారం రేగుతోంది. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే సారు… కారు…. సర్కార్ అనే డైలాగ్ ను వాడటం వెనుక ఆంతర్యం ఏమిటో ఇప్పుడు అర్థం అయిందన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ , మాజీ ఎంపీ విజయశాంతి. ఎంతో పవిత్రమైన యాదగిరిగుట్ట ఆలయ ఆధునీకరణ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న స్థూపాలపై దేవతామూర్తులతో పాటు కేసీఆర్ సార్ బొమ్మను.. కార్ గుర్తును.. టీఆర్ఎస్ సర్కార్ గుర్తును చెక్కడం ద్వారా.. కేసీఆర్ తనను తాను మహారాజుగా  ఊహించుకుంటున్నారని అర్థం అవుతోందని విమర్శించారు విజయశాంతి.

రాజులు, రాజ్యాలు కనుమరుగైన తర్వాత కూడా కేసీఆర్ తన దొరతనాన్ని ప్రదర్శించాలనుకోవడం  ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అన్నారు విజయశాంతి. ప్రతిపక్షాలు ఈ విషయంపై చేసే ప్రకటనలను కేసీఆర్ రాజకీయ కోణంలో చూసి.. వాటిని లైట్ గా తీసుకునే ప్రమాదం ఉందన్నారు. తిరుమలతో సమానంగా తెలంగాణలో యాదగిరిగుట్టను కూడా ఇక్కడి ప్రజలు ఎంతో పవిత్ర క్షేత్రంగా నమ్ముతారనీ.. అలాంటి పవిత్ర క్షేత్రాన్ని రాజకీయ ప్రచారానికి  వాడుకుంటూ.. ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ నియంతృత్వ తీరుపై మఠాధిపతులు పీఠాధిపతులు స్పందించాలన్నారు. ధర్మో రక్షతి రక్షితః అనే నానుడికి  తగ్గట్లు హైందవ ధర్మాన్ని కాపాడే పెద్దలు టీఆర్ఎస్ పాలకులకు కనువిప్పు కలిగిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు విజయశాంతి.