
మక్తల్(మాగనూర్), వెలుగు: మాగనూర్ లోని బ్రిడ్జి సమీపంలోని పెద్దవాగు నుంచి పర్మిషన్ లేకుండా ఇసుక తరలిస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ టిప్పర్లను గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు అడ్డుకున్నారు. మాగనూరు పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తే ఊరుకోబోమని తేల్చిచెప్పారు.
గత కొన్నాళ్లుగా ఇసుక తరలించడంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. మాగనూరు నుంచి కాకుండా ఆన్లైన్లో టీజీఎండీసీ రీచ్ల నుంచి ఇసుక తరలిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం తహసీల్దార్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. టిప్పర్లు, జేసీబీలను గ్రామస్తులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.